బెంగళూరు: టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా మ్యాగీనే. ఒక వ్యక్తి భార్యకు కేవలం ఇది మాత్రమే వండటం తెలుసు. నూడుల్స్ తప్ప ఇంకేమీ చేయడం ఆమెకు రాదు. దీంతో మూడు పూటలు మ్యాగీ తినలేక విసిగిపోయిన ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడు. విస్తూపోయే ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ప్రస్తుతం పెళ్లిళ్లతోపాటు విడాకులు కూడా ఇన్స్టెంట్గా మారుతున్న తీరుకు ఇది ఉదాహరణగా నిలుస్తున్నది.
మైసూరులోని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఎల్ రఘునాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బళ్లారి జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన విడాకుల కేసును ఆయన గుర్తు చేశారు. భార్య వంటపై విసుగెత్తిన ఒక వ్యక్తి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ‘ఉదయం బ్రేక్ఫాస్ట్ నూడుల్స్, మధ్యాహ్న భోజనం, రాత్రి పూట కూడా నూడుల్సే. ఆ భార్య షాప్కు వెళ్లి కేవలం ఇన్స్టంట్ నూడుల్స్ మాత్రమే కొంటుంది. రోజూ మూడు పూటలా అదే వండి పెడుతుంది. ఇది తప్ప ఆమెకు మరేది రాదు. ఈ విషయం తెలిసి రోజూ మూడు పూటలు నూడుల్స్ తినలేక విసుగెత్తిన భర్త విడాకులు కోరాడు’ అని చెప్పారు.
కాగా, ఆ భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని న్యాయమూర్తి ఎంఎల్ రఘునాథ్ తెలిపారు. ఈ విడాకులను ‘మ్యాగీ కేసు’గా ఆయన అభివర్ణించారు. చాలా చిన్న కారణాలతో భార్యాభర్తలు విడాకులు కోరుతున్నారని, ఇలాంటివి ఎన్నో తాను చూశానని అన్నారు. ప్లేట్లో ఉప్పును తప్పువైపు వేయడం, పెళ్లికి తగిన కలర్ డ్రెస్ తీసుకురావకపోవడం వంటివి ఎన్నో విడాకుల కేసులు ఉన్నాయన్నారు. ఒక వ్యక్తిని పాము కాటేసిందని, ఇందులో భార్య తప్పులేకపోయినా దానికి ఆమే కారణమంటూ విడాకులు కోరిన మరో ఆసక్తికర కేసును ఆయన గుర్తు చేశారు.