కృష్ణాష్టమి 2021 | నల్లనయ్య చల్లనయ్య. తన దగ్గరికి వచ్చిన భక్తులను కోరకుండానే అనుగ్రహిస్తాడు. ఆనాడు కుచేలుడు అడక్కుండానే సిరిసంపదలు ప్రసాదించాడు. అంతటి దయాశీలి వేణుగోపాలుడిగా, సంతాన ప్రదాతగా కొహెడ గ్రామంలో కొలువుదీరాడు. హైదరాబాద్కు కూతవేటు దూరంలోని హయత్నగర్ మండల పరిధిలో ఉందీ గ్రామం. ఎనిమిదిన్నర శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గుడికి నిత్యం వందలమంది భక్తులు వస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో వేలమంది తరలి వస్తారు. రుక్మిణీ, సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఆలయ విశేషాలివి..
సుమారు వెయ్యేండ్ల కిందట కొహెడ పరిసరాల్లోని గుట్ట ప్రాంతంలో కోయరాజులు నివసించేవారు. గుట్టకు తూర్పున ఓ పట్టణం ఉండేది. అక్కడ నాగరికులు ఉండేవారు. ఒకసారి గుట్టకు తూర్పున ఉన్న రంగనాయక స్వామి సేవలో నిమగ్నులై ఉన్నారు కోయరాజులు. అదే సమయంలో వారిపై నాగరికులు దాడి చేశారు. ఇరువర్గాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. అమాయకులైన కోయలు అనేకమంది బలయ్యారు. ఇది జరిగిన కొన్నాళ్లకు పట్నవాసులకు అనారోగ్యం మొదలైంది. రక్త విరేచనాలతో ఒక్కొక్కరూ చనిపోసాగారు. కోయరాజుల శాపం వల్లే తమకీ దుర్గతి పట్టిందని అర్థమైంది నాగరికులకు. కోయరాజులను శరణుజొచ్చి క్షమించమని వేడుకొన్నారు. వారిని మన్నించి తమ పేరుతో కొహెడ గ్రామం నిర్మించాలని ఆదేశించారు కోయరాజులు. అలా కొహెడ గ్రామం నిర్మితమైంది. తదనంతరం కోయరాజులు వేణుగోపాల స్వామి ఆలయాన్ని కట్టించారని స్థలపురాణం. అనుబంధంగా మహాదేవాలయం, హనుమాన్ ఆలయాలు నిర్మించారు. ఆలయం నిర్మించిన నాటి నుంచి ఇక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు.
కృష్ణుడి ఆరాధన విచిత్రంగా ఉంటుంది. వెన్నెముద్దలు నివేదనగా సమర్పిస్తే వెండి ముద్దలు అనుగ్రహిస్తాడు. మీగడపాలు నైవేద్యం పెట్టి పాహిమాం అంటే చాలు, పాపాలు తీసేస్తాడు. పరీక్షలు పెడతాడు, పరిష్కారాలూ చూపుతాడు. నమ్మిన వాళ్లను చల్లగా చూస్తాడు. నమ్మని వాళ్లను నమ్మేలా చేస్తాడు. అందుకు నిదర్శనంగా వేణుగోపాలుని సన్నిధికి వచ్చి కోర్కెలు తీరిన భక్తులు బారులు బారులుగా కనిపిస్తారు. కొత్త ఆశలతో వచ్చే వాళ్లు గుంపులు గుంపులుగా ఉంటారు. పెండ్లి కాని యువతులు ధనుర్మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే ఆలయానికి వచ్చి, స్వామిని దర్శించి.. హారతులతో గోదాదేవికి ప్రదక్షిణలు చేస్తే తప్పక వివాహం అవుతుందని నమ్మకం. ఏటా ఫాల్గుణ మాసంలో ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారిని గ్రామంలో వైభవంగా ఊరేగిస్తారు. సంతానం లేని దంపతులు బ్రహ్మోత్సవాల్లో గరుడ ముద్ద స్వీకరించి, మరుసటి రోజు కల్యాణోత్సవంలో పాల్గొంటే పిల్లలు కలుగుతారని విశ్వాసం. ఆలయంలో ఏటా కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి.
శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయం కాలక్రమంలో జీర్ణావస్థకు చేరుకుంది. ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త భార్య చొరవతో ఆలయ పునరుద్ధరణ జరిగింది. తమ వంశ వారసుడి కోసం పరితపిస్తున్న ఆమెకు స్వామి స్వప్నంలో సాక్షాత్కరించాడట. తర్వాత కొంతకాలానికి వారసుడు కలగటంతో ఆ సంపన్నురాలు 2001లో ఆలయాన్ని పునరుద్ధరించారు. గ్రామస్తుల సహకారంతో గాలిగోపురం, కల్యాణ మంటపం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సంతాన గోపాల స్వామి మహిమలు తెలిసి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తారు. హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో వారాంతాల్లో పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు.
-దుబ్బాక యాదయ్య