భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లాలోని ఖుంట ఏరియాలో ఓ భారీ రాచనాగు (కింగ్ కోబ్రా) కలకలం రేపింది. ఓ పాడుబడ్డ బావిలో 12 అడుగుల పొడవుగల ఒక భారీ రాచనాగు పడింది. ఆ పాము బుసలు కొడుతూ పైకి రావడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతుండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు, స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు.
స్నేక్ రెస్క్యూ టీమ్తో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు బావిలో పడిన ఆ భారీ రాచనాగును రక్షించారు. బావి నుంచి వెలికితీసి సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆ కింగ్ కోబ్రా బావిలో ఎన్ని రోజుల క్రితం పడిందో తెలియదని, అయితే అది పూర్తి ఆరోగ్యంగానే ఉన్నదని అటవీ అధికారులు చెప్పారు.