Viral News | బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తినాలనిపించాలే గానీ, ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా క్షణాల్లో మనముందుకొచ్చేస్తుంది. అయితే, సాధారణంగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే.. ఎవరైనా ఏం చేస్తారు..? మనమున్న ప్రాంతానికి అత్యంత సమీపంలోని హోటల్నుంచి ఆర్డర్ చేసుకుంటాం. కానీ, ముంబైకి చెందిన ఓ యువతి మాత్రం పక్క రాష్ట్రం నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకుంది. విచిత్రంగా ఉంది కదూ..? మీరు విన్నది నిజమే.
ముంబైకి చెందిన ఓ యువతి ఫుల్గా మద్యం సేవించింది. ఫుడ్ ఆర్డర్ కోసం తన ఫోన్ తీసింది. మద్యం మత్తులో ఈనెల 21వ తేదీన జొమాటోలో బెంగళూరులోని మేఘనా ఫుడ్స్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకుంది. దాని ధర ఎంతనుకుంటున్నారు.. రూ.2500. దీంతో షాకైన యువతి తన ఆర్డర్ను చెక్ చేసుకోగా.. బెంగళూరు రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకున్నట్టు చూపించింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే ఆమెకు తర్వాతి రోజు (జనవరి 22)న ఫుడ్ డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని సదరు యువతి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ‘నేను బెంగళూరు నుంచి రూ.2,500 విలువైన బిర్యానీని ఆర్డర్ చేశానా..?’ అంటూ పోస్టు చేసింది. ఆర్డర్ ప్లేస్కు సంబంధించిన పిక్ను ట్వీట్కు జతచేసింది. అనంతరం ఫుడ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఫొటోలను సైతం పోస్ట్ చేసింది.
కాగా, ఈ ట్వీట్కు జొమాటో సైతం స్పందించింది. ‘ఆర్డర్ మీ ఇంటి వద్దకు చేరాకా.. మీ అనుభవం గురించి తెలియజేయండి’ అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
best decision ever, @zomato where is my paycheck 👉🏼👈🏼 pic.twitter.com/eqBD1NfSsd
— subiii (@_subiii_) January 22, 2023