హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దర్యాప్తులో సిట్ మరో ముందడుగు వేసింది. కీలక నిందితుడైన ప్రవీణ్ నుంచి డీఏవో (డివిజనల్ అకౌంట్స్ అఫీసర్) పేపర్ను కొనుగోలు చేసిన సాయిలౌకిక్, సుస్మిత దంపతులను శుక్రవారం అరెస్టు చేసింది. సాయిలౌకిక్ ఖమ్మంలో కార్ల వ్యాపారి. ఆయన భార్య సుస్మిత హైదరాబాద్లో సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ గ్రూప్-1, డీఏవో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నది. నిరుడు అక్టోబర్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన సుస్మిత.. ఓఎంఆర్ షీట్లో హాల్టికెట్ నంబర్ను రాంగ్ బబ్లింగ్ చేయడంతో టీఎస్పీఎస్సీ అనర్హ జాబితాలో చేర్చింది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ సుస్మిత టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి అధికారులను కలిసింది. ఆ క్రమంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రాంచంద్రన్ పీఏ ప్రవీణ్ను కలిసి ఆవేదన వ్యక్తం చేసింది. డీఏవో పరీక్షకు సిద్ధమవుతున్నానని, టీఎస్పీఎస్సీ చుట్టూ తిరగడం వల్ల సమయం వృథా అవుతున్నదని పేర్కొన్నది.
దీంతో ప్రవీణ్ తన వద్ద డీఏవో మాస్టర్ ప్రశ్నాపత్రం ఉన్నదని బేరం పెట్టాడు. సుస్మిత, ఆమె భర్త కలిసి ప్రవీణ్తో రూ.10 లక్షలకు మాట్లాడుకొని ముందుగా రూ.6 లక్షలు, పరీక్ష ఫలితాలు వచ్చాక మిగతా రూ.4 లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ప్రవీణ్ డీఏవో ప్రశ్నాపత్రం కాపీని అందజేయడంతో సాయిలౌకిక్ తన కార్ల కంపెనీ ఖాతా నుంచి రూ.6 లక్షలు ప్రవీణ్ ఖాతాలోకి బదిలీ చేశాడు. సిట్ అధికారుల విచారణలో గ్రూప్-1, ఏఈ ప్రశ్నాపత్రాలను మినహా మరే పేపర్లనూ ఇతరులకు ఇవ్వలేదని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరిలో అతని బ్యాంకు ఖాతాలో రూ.6 లక్షలు డిపాజిట్ కావడంపై ప్రశ్నించగా.. కారును విక్రయించానని, ఖమ్మంలో ఉండే ఓ వ్యక్తి ఆ డబ్బును తన ఖాతాలో డిపాజిట్ చేశాడని చెప్పాడు. అనుమానంతో కాల్ డాటాను కూడా విశ్లేషించిన సిట్.. ఖమ్మంలో సాయిలౌకిక్ను ఆరా తీయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. దీంతో సాయిలౌకిక్, సు స్మితను అరెస్టు చేసి జైలుకు పంపిన సిట్.. ఆ దంపతులను కూడా కస్టడీలోకి తీసుకోనున్నది. వారి నుంచి ఇతరులకేమైన పేపర్ వెళ్లిం దా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నది.