శాంటియాగో: ఒక ఉద్యోగి నెల జీతం రూ.43,000. అయితే ఒక కంపెనీ పొరపాటున అతడి బ్యాంకు ఖాతాలో రూ.1.4 కోట్లు జమ చేసింది. దీంతో ఆ ఉద్యోగి వెంటనే తన జాబ్కు రిజైన్ చేశాడు. ఎవరికీ అందుబాటులో లేకుండా మాయమయ్యాడు. ఆశ్చర్యం కలిగించే ఈ సంఘటన చిలీ దేశంలో జరిగింది. ఆ దేశంలో కోల్డ్ కట్లను ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థల్లో కన్సోర్సియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్ (సియల్) ఒకటి. అందులో పని చేసే ఒక ఉద్యోగి నెల జీతం 5,00,000 పెసోలు (రూ.43,000). అయితే జూన్ నెల వేతనంగా 16,53,98,851 పెసోలు (సుమారు రూ.1.42 కోట్లు) అతడి బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఆ కంపెనీ పొరపాటున ఆ ఉద్యోగి జీతానికి 286 రెట్లు మేర చెల్లించింది.
అనంతరం జరిగిన పొరపాటును హెచ్ఆర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ మేనేజర్ గ్రహించారు. దీంతో జీతం కంటే ఎక్కువగా అందుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని ఆ ఉద్యోగిని అడిగారు. బ్యాంకుకు వెళ్లి ఆ పని చేస్తానని ఆ ఉద్యోగి తెలిపాడు. అయితే ఆ ఉద్యోగి నుంచి కంపెనీకి డబ్బులు తిరిగి రాలేదు. మరోవైపు జూన్ 2న ఆ వ్యక్తి తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు. రాజీనామా లేఖను ఆ కంపెనీకి పంపాడు. అనంతరం ఎవరికీ కనిపించకుండా పోయాడు. దీంతో చేసేదేమీ లేక ఆ ఉద్యోగిపై లీగల్ యాక్షన్కు ఆ కంపెనీ సిద్ధమైంది.