గర్భిణులకు ఏడునెలలు నిండిన తర్వాత పుట్టింటిలో లేదంటే అత్తగారింటిలో శ్రీమంతం వేడుకని ఘనంగా నిర్వహిస్తారు. కొత్త గాజులు, చీర పెడతారు. బంధువులు, ఆత్మీయులు అక్షింతలు చల్లి.. పండంటి బిడ్డను కనాలంటూ దీవెనలు అందిస్తారు. అయితే, పుట్టింటికి వెళ్లలేకపోయిన మహిళా కానిస్టేబుల్కు సిబ్బంది పోలీస్స్టేషన్లోనే శ్రీమంతం నిర్వహించారు. ఈ సంఘటన చెన్నైలోని కే2 అయనవరం పోలీస్ స్టేషన్లో జరిగింది.
కే2 అయనవరం పోలీస్ స్టేషన్లో గ్రేడ్ 1 కానిస్టేబుల్గా పనిచేస్తున్న సౌమ్యకు ఏడు నెలలు నిండాయి. ఆమె తల్లిగారిది తిరువన్నమలై. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె పుట్టింటికి వెళ్లలేకపోయింది. ఈ విషయాన్ని తోటి మహిళా కానిస్టేబుళ్లు, ఎస్ ఐ మురుగేషన్ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో, ఆయన స్టేషన్లోనే సౌమ్యకు శ్రీమంతం చేయాలని నిర్ణయించారు. ఆదివారం రోజు (నవంబర్ 20వ తేదీన) సిబ్బంది సౌమ్యకు స్టేషన్లోనే కొత్తచీర, గాజులు కానుకగా ఇచ్చి, స్వీట్లు తినిపించారు. అంతేకాదు ఆరోజు ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వాళ్లందరికీ, స్టేషన్ పరిసరాల్లోని వాళ్లకు ఉచితంగా భోజనం ఏర్పాటుచేశారు. దాంతో, ఆ ఊరివాళ్లంతా స్టేషన్ సిబ్బందిని ప్రశంసించారు.
స్టేషన్ అధికారులు, సిబ్బంది ఆత్మీయుల్లాగ తనకు శ్రీమంతం చేయడంతో సౌమ్య సంతోషంతో పొంగిపోయింది. ఆమె రెండేళ్లుగా అక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. ఆమె భర్త పేరు సత్యమూర్తి. సేలంకు చెందిన అతను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు.