ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు జర్నీ చేయాలంటే కొంచెం చికాకుగా అనిపిస్తుంది. ఎక్కువ దూరం ఆటోలో వెళ్లాలంటే బోర్ అనిపిస్తుంది. కానీ, బెంగళూరుకు చెందిన రాజేష్ ఆటో ఎక్కితే మాత్రం అస్సలు బోర్ కొట్టదు. జర్నీ ఆసాంతం కంఫర్ట్గా ఉంటుంది. ఆటో ఎక్కినవాళ్లకు బోర్ అనిపించడకుండా ఉండడానికి ఇతను ఏం చేశాడంటే…. ఆటోలో శానిటైజర్, ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు నీళ్ల బాటిళ్లు, రిఫ్రెష్నర్స్, బిస్కెట్లు, కాఫీ చాక్లెట్లు కూడా అందుబాటులో ఉంచాడు. దేవుళ్ల పుస్తకాలు కూడా పెట్టాడు. కస్టమర్లు తన ఆటోలో రైడ్ని గుర్తుపెట్టుకునేలా చేస్తున్నాడు రాజేష్. దాంతో, ఆటో ఎక్కిన వాళ్లు ఐడియా సూపర్ అంటూ అతడిని మెచ్చుకుంటున్నారు.
కస్టమర్ నాకు కింగ్
రాజేష్ ఆటో ఎక్కిన ఉత్తమ్ కశ్యప్ అనే సోషల్ మీడియా యూజర్ ఆటోలోని ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ ఎందుకు పెట్టావని అడిగితే నాకు కస్టమర్ కింగ్. వాళ్లకు నా ఆటోలో ప్రయాణం సురక్షితంగా, సౌకర్యంగా ఉండాలనేది నా ఉద్దేశం అని చెప్పాడు రాజేష్. దాంతో ఆటో లోపల ఫొటోల్ని ట్విట్టర్లో పెట్టాడు ఉత్తమ్. ఇతని ఆటో ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులో ఈమధ్యే ఆటో యూనియన్ వాళ్లు సొంతంగా నమ్మ యాత్రి అనే యాప్ తీసుకొచ్చారు. దాంతో, ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు రాజేష్ తన ఆటోలో ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడు.