ఎట్టెట్టా.. ముంబైలోని తాజ్ హోటల్లో 6 రూపాయలకే రూమ్ ఇస్తున్నారా? అని నోరెళ్లబెట్టకండి. అది ఇప్పుడు కాదు.. ఒకప్పుడు అంటే.. 1903వ సంవత్సరంలో ముంబై తాజ్ హోటల్లో ఒక్క నైట్కు ఒక రూమ్ ధర అది. 1903 నాటి తాజ్ హోటల్ ఫోటోను, అప్పటి ధరను ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ద్రవ్యోల్బణాన్ని తప్పించుకోవాలంటే.. టైమ్ మిషన్ ఎక్కి వెనక్కి వెళ్లండి. ముంబై, తాజ్ హోటల్లో 6 రూపాయలకే రూమ్ ఇచ్చేవారట. కానీ. ఇప్పుడు ఆరోజులు ఉన్నాయా? అంటూ ఆనంద్ చేసిన ట్వీట్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఆయన ట్వీట్పై నెటిజన్లు తెగ రెస్పాండ్ అయి.. వాళ్ల లెక్కలు కూడా చెప్పారు. 1903లో 6 రూపాయలు కాదు సార్.. అప్పుడు 13 రూపాయలు చార్జ్ చేసేవాళ్లు. ఫ్యాన్, అటాచ్ బాత్రూమ్తో కలిపి అంత చార్జ్ చేసేవాళ్లు. ఫుల్ బోర్డ్ అయితే 20 రూపాయలు చార్జ్ చేసేవాళ్లు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ హోటల్ను మిలిటరీ ఆసుపత్రిగా మార్చారు. అప్పుడు 600 బెడ్లను ఏర్పాటు చేశారు.. అంటూ ఓ నెటిజన్ ఆనంద్ మహీంద్ర ట్వీట్కు రిప్లయి ఇచ్చాడు.
నేను నా చిన్నప్పుడు 50 కిలోమీటర్ల వరకు సైకిల్ మీద ఫ్రీగా వెళ్లేవాడిని. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ కొనుక్కొని వెళ్తున్నా.. అంటూ మరో నెటిజన్లు రిప్లయి ఇచ్చాడు.
ఇంకో నెటిజన్ మాత్రం.. అప్పటి బంగారం ధరను లెక్క వేసి.. అప్పట్లో 6 రూపాయలకు 2.67 గ్రాముల బంగారం వస్తుందని.. ఇప్పుడు అదే 2.67 గ్రాములకు 13,000 రూపాయలు అవుతుందని. పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు.. అంటూ తనకు తెలిసిన లెక్కలు చెప్పాడు. ఇలా.. ఎవరికి తోచిన లెక్కలు వాళ్లు చెప్పారు. మొత్తానికి అలా.. తాజ్ హోటల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.