చెన్నై: సాధారణంగా గర్భిణులకు సీమంతం చేస్తారు. ఆ గర్భిణి దీర్ఘ సుమంగళిగా ఉండాలని, ఆమె కడుపులోని బిడ్డ దీర్ఘాయుష్షుతో జీవించాలని ఈ వేడుకలో ముత్తైదువలు అక్షింతలు వేసి దీవిస్తారు. సీమంతం అనే పదానికి పాపిట తీయడం అని అర్థం. అంటే భార్య గర్భిణిగా ఉన్న సమయంలో భర్త ఆమెకు పాపిట తీయడం దగ్గరనుంచి అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలని, కంటికి రెప్పలా కాపాడుకోవాలని తెలియజెప్పడం ఈ వేడుక ఉద్దేశం.
అయితే, తాజాగా తమిళనాడుకు చెందిన ఓ మహిళ కడుపుతో ఉన్న తన పెంపుడు పిల్లులకు సీమంతం చేసింది. గర్భం దాల్చినప్పటి నుంచి ఆ పిల్లులకు క్రమం తప్పకుండా ఓ వెటర్నరీ క్లినిక్లో పరీక్షలు కూడా చేయించింది. వైద్యుల సూచన మేరకు ప్రత్యేకమైన ఆహారం, స్నాక్స్ అందజేసింది. తాజాగా పూలు, పండ్లతోపాటు తన పిల్లులను క్లినిక్కు తీసుకెళ్లి సీమంతం నిర్వహించింది. ఈ సీమంతం వేడుకలో వైద్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భంతో ఉన్న రెండు పిల్లులను ఆశీర్వదించారు.
సాధారణంగా గర్భిణి అయిన మహిళలకు వారి కుటుంబం సభ్యులు సీమంతం చేస్తారు. ఈ పిల్లులు కూడా మా కుటుంబంలో సభ్యులుగా పెరిగాయి. అందుకే వాటికి మనుషులకు నిర్వహించినట్లే సీమంతం నిర్వహించాం. పిల్లులకు వైద్యపరీక్షలు చేస్తున్న క్లినిక్లోనే వైద్యులతో కలిసి ఈ వేడుకలు జరిపాం అని పిల్లులకు సీమంతం నిర్వహించిన మహిళ తెలిపారు.