Senior World | మధ్యతరగతి జీవితం.. బాధ్యతల బందిఖానా. చదువు, పెళ్లి, కుటుంబం, పిల్లలు, చదువులు, వాళ్ల వివాహాలు, అంతలోనే రిటైర్మెంట్. ఆ పరుగులో పడిపోయి నాలుగు గోడలే ప్రపంచంగా బతికేస్తారు. అసలుసిసలు ప్రపంచాన్ని దర్శించే అవకాశమే ఉండదు. అరవై తర్వాతబోలెడంత తీరిక ఉన్నా.. ఎక్కడికీ వెళ్లాలనిపించదు. ‘ఓపిక లేకపోవడం అనేది ఓ మానసిక జాడ్యం. మీరు ప్లాన్ చేసుకోండి. మేం తీసుకెళ్తాం’ అంటున్నారు కొందరు టూర్ ఆపరేటర్లు.
సీనియర్ సిటిజన్లకు పెన్షన్లు వస్తుంటాయి. ఎంతోకొంత పొదుపు సొమ్మూ ఉంటుంది. లేనిదల్లా.. ఉత్సాహమే. ఆ ఒక్కటి అందించగలిగితే.. అరవైలలో ఇరవై వచ్చేస్తుంది. బాక్సర్ వేసుకుని, బ్యాక్ప్యాక్ తగిలించుకుని టూర్లకు సిద్ధం అవుతారు. ఢిల్లీకి చెందిన ‘సీనియర్ వరల్డ్’ అనే సంస్థ ఆ వయోధిక యాత్రికులకు టూర్ ఆపరేటర్గా వ్యవహరిస్తుంది. రంగురంగుల చేపలు, పగడాల దిబ్బలతో కనువిందు చేసే సముద్ర గర్భంలో ఈదులాడటం అంటే కలల ప్రపంచంలో అడుగుపెట్టడమే. కాకపోతే.. సాహస విన్యాసాలు చేయడం, పర్వతాలను అధిరోహించడం పెద్దలకు తలకుమించిన పనిలా అనిపిస్తుంది. అంతరిస్క్ ఎందుకని.. ఏ కాశీయాత్రకో పరిమితం అవుతారు. ఇప్పుడు అదంతా గతం. వృద్ధులను సుదూర పర్యటనలకు తీసుకెళ్లడానికి, వారికి సాహసకృత్యాలను పరిచయం చేయడానికి కొన్ని సంస్థలు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. వాటిలో ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్కు చెందిన‘సీనియర్ వరల్డ్’ ప్రముఖమైంది. దీన్ని రాహుల్ గుప్తా, ఎంపీ దీపు అనే జంట ఆంత్రప్రెన్యూర్స్ ప్రారంభించారు.
మొదట్లో సంస్థ సేవలు ఆన్లైన్లో వృద్ధులకు జీవనశైలి చిట్కాలు అందించడానికి, అవసరమైన వస్తువులు సరఫరా చేయడానికే పరిమితం. క్రమంగా యాత్రలకూ విస్తరించారు. తొలి ప్రయాణికులు ఢిల్లీ వాస్తవ్యులైన.. కెకె రిఖీ, ఆయన భార్య సుధ. ఇద్దరూ 70లలో ఉన్నవాళ్లే. రిఖీ ఆర్మీ ఉద్యోగి కావడంతో క్షణం కూడా తీరిక ఉండేది కాదు. దీంతో ఆ దంపతులు తరచూ తమ పర్యటనలను వాయిదా వేసుకునేవారు. ఆ వెలితిని తీర్చుకునేందుకు రిఖీ రిటైర్మెంట్ తర్వాత.. సీనియర్ వరల్డ్ను ఆశ్రయించారు. గడచిన రెండేండ్లలో మూడుసార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చారు ఇద్దరూ. సీనియర్ వరల్డ్ ఇప్పటివరకు 200కు పైగా ట్రిప్పులు వేసింది. వీటిలో భూటాన్, ఇండోనేసియా, సింగపూర్, కెన్యా సహా పాతిక విదేశాలు ఉన్నాయి.
సుదూర ప్రయాణాలు పెద్దలకు సవాలే. ఓ వయసుకు వచ్చాక ఏదో ఒక ఆరోగ్య సమస్య వారిని ఇబ్బందిపెడుతూ ఉంటుంది. అందుకే, పర్యాటక బృందం బాగోగులు చూసుకోవడానికి ఓ నిపుణుడైన కేర్ మేనేజర్ ఉంటాడు. ‘ఎన్నో ఏండ్ల నుంచీ కలలుగా మిగిలిపోయిన యాత్రా స్వప్నాలను నిజం చేయడమే మా లక్ష్యం. ప్రయాణికుల భద్రత మా తొలి ప్రాధాన్యం’ అంటారు సీనియర్ వరల్డ్ సహ-వ్యవస్థాపకురాలు దీపు. ఇటీవలి పర్యటనలో ఒక యాత్రికుడికి కౌలాలంపూర్లో గుండెపోటు వచ్చింది. టూర్ మేనేజర్ అతని సంరక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. ప్రాణాలనూ కాపాడాడు. ఇప్పటివరకు 5,000 మంది పెద్దలు ‘సీనియర్ వరల్డ్’ సేవలను వినియోగించుకున్నారు. చార్జీలు.. ఐదు రాత్రులకు ఒక్కరికి 50,000 రూపాయల నుంచి చార్జీలు మొదలవుతాయి.
వృద్ధాప్యం భారం కావొద్దు..
గురుగ్రామ్లో 2006లో ఓ టెలికాం కంపెనీలో పనిచేస్తున్నప్పుడు.. దీపు, గుప్తా తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరివీ ఒకే రకం ఆలోచనలు. పెద్దలు తమ జీవితాన్ని తమకు నచ్చినట్టు, ఎవ్వరి మీదా ఆధారపడకుండా గడిపేట్టు ఓ ప్రాజెక్ట్ డిజైన్ చేయాలని భావించారు. తమ కార్పొరేట్ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూనే పెద్దల కోసం పనిచేసే దిశగా అడుగులు వేశారు. సాధారణంగా వయసు మీద పడుతున్న కొద్దీ శారీరక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి. ఇట్టే కుంగుబాటుకు లోనవుతారు. కాబట్టి, పెద్దలు వృద్ధాప్యాన్ని భారంగా భావించకుండా, దాన్నో సానుకూలమైన మార్పుగా భావించేలా.. తమ సేవలను అందుబాటులోకి తెచ్చారు. వారికి నమ్మకమైన సేవలను అందిస్తూ మన్ననలను చూరగొన్నారు. అలా సీనియర్ వరల్డ్ను ఫేస్బుక్లో అనుసరించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు దాదాపు మూడు లక్షలకు చేరుకుంది.
దీపు, గుప్తా తమ సంస్థను ఎక్స్ప్రెస్, ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎంజాయ్ అనే నాలుగు ‘ఈ’ల చుట్టూ నిర్మించుకున్నారు. అన్నట్టు వీరికి ‘సిల్వర్ వింగ్స్’ అనే యాప్ కూడా ఉంది. దీని ద్వారా వివిధ ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు. ఇందులో పజిల్స్, క్విజ్లు, ఫిట్నెస్ చిట్కాలు, ధ్యానం, ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు ఉంటాయి. అలా వృద్ధులుమానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా తమవంతు ప్రయత్నిస్తున్నారు. సామాజికంగా చురుగ్గా ఉండేందుకు సాయపడుతున్నారు. మలిసంధ్యలో ఉన్నవారికి.. ప్రపంచం ఎంతో అందమైందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఇలాంటి సంస్థలు అందుబాటులో ఉంటే మన సంశయాలన్నీ పక్కన పెట్టేసి ప్రతి క్షణాన్నీ పరిపూర్ణంగా ఆస్వాదించవచ్చు’ అంటారు గురుగ్రామ్కు చెందిన 70 ఏండ్ల పరమ్జీత్ ఖరల్. ప్రయాణాలు మనిషికి కొత్త గాలిని పరిచయం చేస్తాయి. కొత్త జ్ఞాపకాలను మూటగట్టి ఇస్తాయి. ఈ దశలో వయోధికులకు కావలసింది కూడా ఆ కొద్దిపాటి మార్పే.