Travel | ‘సంవత్సరానికోసారి భూటాన్ వెళ్లగలిగిన వారు ఈ భూమ్మీద అదృష్టవంతులు’ అంటారు ఓల్గా. ఆ అదృష్టాన్ని వెతుక్కుంటూ ముప్పై నుంచి అరవై అయిదేళ్ల వయసున్న మరో పదకొండుమంది మహిళలతో కలిసి వారంరోజుల భూటాన్ యాత్రకు బయల్దేరాను.
హైదరాబాద్లో ఫ్లయిట్ ఎక్కి, రెండున్నర గంటల తర్వాత వెస్ట్ బెంగాల్లోని ‘బాగ్ డోగ్రా’లో దిగి.. జీప్లో మూడు గంటలు ప్రయాణించాక.. ఇండియా – భూటాన్ సరిహద్దు చేరుకున్నాం. రెండుదేశాలను వేరుచేసే విభజన రేఖను చూడటం నాకిదే మొదటిసారి. నేను నిల్చున్న ఆ రెండడుగుల నేలకు.. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఒకవైపు – ప్రపంచంలోనే అతి తక్కువ జనసాంద్రత కలిగిన ఆకలీ అలజడులూ లేని చిన్నదేశం మరో వైపు ఉన్నాయన్న ఆలోచనే నాలో భావోద్వేగాన్ని కలిగించింది. బోర్డర్ మీదే ‘ఆన్-అరైవల్ వీసా’ తీసుకుని, ఎదురుగుండా ఉన్న పక్క దేశపు హోటల్కు చేరుకున్నాం. అక్కడే భోజనం చేసి నిద్రపోయాం.
థింపూ యాత్ర
ఉదయాన్నే మా బస్ డ్రైవర్ ‘సంగీ వాంగీ’, టూర్ గైడ్ ‘నోర్బూ’ మమ్మల్ని ‘కుజూ జంపోలా’ (గుడ్ మార్నింగ్) అని పలకరించాక.. అందరం మినీ బస్లో భూటాన్ రాజధాని థింపూ బయల్దేరాం. మామూలుగా బోర్డర్ నుంచి థింపూ వెళ్లడానికి అయిదు గంటలు చాలు. కానీ, ముందురోజు వర్షానికి కొండరాళ్లు దొర్లడంతో మా ప్రయాణం మందకొడిగా సాగింది. కనుచూపుమేరా దూది పింజల్లా మేఘాలు. నిటారుగా ఆకాశాన్నంటుతున్న పొడవైన చెట్లు. నల్లటి పాము మెలికల్లాంటి తారురోడ్డు. ప్రయాణం నయన ప్రియం అయినపుడు.. కాళ్లు మాత్రం కుదురుగా ఉంటాయా! అరవైలలో ఉన్నవాళ్లు కూడా ఇరవైలలోకి దూకేశారు. పాటలు, డ్యాన్సులు, నవ్వులు, కేరింతలు. వాంగ్ వేసిన సడన్ బ్రేక్తో ఈలోకంలోకి వచ్చిపడ్డాం. ‘ఏంటా!?’ అని దిగి చూస్తే.. రోడ్డుకు అడ్డంగా పెద్దపెద్ద బండరాళ్లు. రోడ్డు ‘సాఫ్’ చేయడానికి చాలా టైమ్ పడుతుందన్నారు. రూటు మార్చి, బస్సు థింపూ చేరేసరికి ఇంకో రెండుగంటలు ఎక్కువ పట్టింది. అలా మొదటిరోజు మొత్తం ఒక ‘రోడ్ ట్రిప్’లా ముగిసిపోయింది.
చలో డోర్ డెన్మా..
రెండోరోజు ఉదయమే థింపూకి దక్షిణం వైపు ఉన్న బుద్ధుడి విగ్రహం ‘డోర్ డెన్మా’ చేరుకున్నాం. 169 అడుగుల ఎత్తుతో బంగారు పూతతో ఉన్న భారీ కంచు విగ్రహం అది. మేఘావృతమైన ఎత్తయిన కొండల మధ్య నీరెండ తాకిడికి పసిడికాంతులతో మెరిసిపోతున్న బుద్ధుణ్ని చూడటానికి రెండు కళ్లూ చాలలేదు. పాలనురగలాంటి మేఘాలు బుద్ధుణ్ని ఆలింగనం చేసుకోవడానికి చేతులు చాపుతున్నాయా? లేక ఆ బుద్ధుడే మేఘాల్లోకి చొచ్చుకుపోతున్నాడా!? అన్నట్టున్న ఆ తథాగతుడి రూపాన్ని చూసి తరించడమే తప్ప.. వర్ణించనలవి కాదు. అసంకల్పితంగా వజ్రాసనం వేసుకుని కాసేపు ధ్యానముద్రలోకి వెళ్లి పరిసరాల్ని మర్చిపోయాను. ఎవరో తట్టి లేపితే అక్కణ్నుంచి మెట్లెక్కి లోపలికి వెళ్లాను. మిరుమిట్లు గొలిపే బంగారుపూతతో చేసిన.. లక్షకు పైగా ఉన్న బుద్ధుడి మినియేచర్ విగ్రహాలను చూసేసరికి మతిపోయింది. అక్కణ్నుంచి దగ్గర్లోనే జరుగుతున్న థింపూ శెచు పండుగ సంబురాన్ని చూడటానికి వెళ్లాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్లో మూడురోజుల పాటు జరిగే అతిపెద్ద ఉత్సవం అది. మేం వెళ్లిన తేదీల్లో ఆ వేడుక రావడం.. నిజంగా మా అదృష్టమే! బౌద్ద సన్యాసుల ప్రార్థనలు, నృత్య ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణ. పసిపిల్లల నుంచి పండుముసలి వరకు.. వేలాదిమంది రంగురంగుల సంప్రదాయ దుస్తుల్లో, పుష్పాలంకరణలతో ఆడుతూ పాడుతూ ఉంటే.. పూలసింగిడి నేల మీదికి దిగి నాట్యం చేస్తున్నట్టుగా అనిపించింది. ఇంతలో సన్నని తుంపర్లతో కూడిన జల్లు మొదలయింది. అన్ని వేలమంది ఉన్నా కూడా ఎక్కడా గోల, తోపులాట లేకుండా క్రమశిక్షణతో ఉండటం చూసి ఆశ్చర్యపోయాను.
‘సింప్లీ’ సూపర్బ్
అక్కణ్నుంచి సింప్లీ భూటాన్ మ్యూజియం చేరుకున్నాం. లోపల చుట్టూ గుడిసెలాంటి దాంట్లో మమ్మల్ని కూర్చోబెట్టి చిన్నకప్పుల్లో సంప్రదాయ వైన్ సర్వ్ చేశారు. మ్యూజియంలో ఒక్కో అర దాటుతుంటే.. అక్కడి గ్రామీణ జీవన విధానం, వంటగది సామాన్లు, ఆహారపు అలవాట్ల గురించి వివరించాడు నోర్బూ. తర్వాత మాకు అల్పాహారం వడ్డించి, సంప్రదాయ నృత్యాన్ని ఏర్పాటుచేశారు. కాసేపయ్యాక మేం కూడా వారితో జతకలిసి చిందులు వేశాం. మా తర్వాతి డెస్టినేషన్.. పునాఖా. రెండుగంటల ప్రయాణం. “పదినిమిషాలు నడవగలిగిన వాళ్లు రండి, సస్పెన్షన్ బ్రిడ్జ్ చూడొచ్చు” అని చెప్పాడు నోర్బు. ఓ కిలోమీటర్ నడిచి రంగు రంగుల జెండాలు కట్టిన సన్నటి పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్నాం. ఉక్కు, చెక్క పలకలతో నిర్మితమైన ఆ వంతెన ఎక్కగానే ఒకలాంటి స్ప్రింగ్ మూమెంట్తో భలే థ్రిల్లింగ్గా అనిపించింది. ఈ వంతెన కిందుగా పారే నది పేరు.. పోచు. దీన్ని తండ్రి నది అనీ, మరొకచోట పారే మోచు (భూటాన్లోని అతి పెద్ద నది)ని ‘తల్లి నది’ అని అంటారట. ఈ పోచు-మోచుల సంగమ నది.. ‘పునా సంగ్ చూ’ కూడా చూశాం.
అక్కడ బస్సెక్కగానే “ఇప్పుడు మిమ్మల్ని ఒక అద్భుతమైన చోటికి తీసుకెళ్తున్నాం. అక్కణ్నుంచి మీకు కదలాలని కూడా అనిపించదు” అని ఊరించసాగాడు నోర్బూ. అదేంటా అన్న ఎక్జయిట్మెంట్లో ఉండగానే బస్సు ఆగింది. పొలోమంటూ దిగి తలోదిక్కూ పోయాం. ‘డోచులా’ అనే పర్వత మార్గంలో మంచు ఆవరించిన నూట ఎనిమిది ‘స్మారక స్థూపాల’ వరుస ఎంతో మనోహరంగా కనిపించింది. వాటి మీదున్న రంగురంగుల కళాత్మక నిర్మాణాల నుంచి కన్ను తిప్పుకోవడం అసాధ్యం. ఇది థింపూ-పునాఖా రహదారిపై ఉంది. ఇక్కడే బొటానికల్ పార్క్, లఖాంగ్ అనే మోనాస్ట్రీ కూడా చూశాం.
అదిగదిగో.. హిమాలయం
అక్కణ్నుంచి వెనుదిరిగి, ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి నా మనసు, కళ్లూ పారాచూట్లాగా విచ్చు కున్నాయి. ఆకుపచ్చ, నీలి, తెలుపు రంగుల్లో తైలవర్ణ చిత్రరాజంలా కనిపించాయి హిమాలయాలు. చిన్నప్పటి నుంచి వాటి గురించి గొప్పగా చదివీ చదివీ, వినీవినీ ఎప్పుడెప్పుడు చూస్తానా!? అని ఉవ్విళ్లూరిన ‘ది గ్రేట్ హిమాలయాస్’ ఒక్కసారిగా కళ్లెదుట కనిపించేసరికి నా గుండె లయ తప్పింది. ఎదురుగా ఉన్న మెట్లమీద కూర్చుని వాటి అందాలను చూస్తూ ఎంతసేపు గడిపానో? పాలనురుగు, లేత, ముదురు నీలి రంగుల టైఅండ్డై చీరలా, జలతారు పరదాల్లాగా పరుచుకుని గాలికి రెపరెపలాడుతున్నట్టు కనిపించే ఆ హిమవన్న గాన్ని ఏకాంతంగా చూస్తుంటే ఏదో తెలియని అవ్యక్తాను భూతి, దగ్గరితనం, ఇంకేదో గుబులు. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. ఆ భారమైన క్షణాలను వదిలి రావడం అంత తేలికేం కాదు. తరువాతి రోజు ‘పారో’ సిటీకి బయల్దేరాం. దారిలో రోడ్డుకు ఇరువైపులా అమ్ముతున్న కూరగాయలను ఆసక్తిగా చూస్తూ, మక్క కంకులను కొనుక్కుని తింటూ పునాఖా జాంగ్ దగ్గర కాసేపు ఆగి, భూటానీయుల సంప్రదాయ దుస్తులను అద్దెకు తీసుకుని.. వేసుకుని.. ఫొటోలు దిగాం. దగ్గర్లో ఉన్న రెండు ‘బౌద్ధ మొనాస్ట్రీ’లను దర్శించుకున్నాం.
మా చివరి పాయింట్ ‘టైగర్స్ నెస్ట్’. పారో వ్యాలీకి ఎదురుగా ఉన్న క్లిఫ్ సైడ్లోని మఠం. ఇదే బౌద్ధుల పరమ పవిత్ర దేవాలయం. వెయ్యి రూపాయలు ఎంట్రీ ఫీజు. లోపల ‘బౌద్ధ దేవత’ కొలువై ఉంటుంది. ఈ దేవతే భూటాన్కు బౌద్ధాన్ని పరిచయం చేసిందని అంటారు. ఆరో రోజు ఓ ఇంట్లో భూటాన్ సంప్రదాయ వంటకాలను రుచి చూశాం. ఇంట్లోకి వెళ్లగానే ఒక అందమైన స్త్రీ చిరునవ్వుతో వెల్కమ్ డ్రింక్ ఇచ్చింది. భూటాన్లో మొదటిసారి ఆరోగ్యకరమైన వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కూడిన ‘స్థానిక భోజనం’ చేశాం. చివరిగా పెరట్లో కాసిన ఆపిల్కాయల ముక్కలు తిని, స్వచ్ఛమైన గాలిని హృదయం నిండుగా పీల్చుకుని.. ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొని బయటికి వచ్చాం. అప్పుడు చెప్పాడు నోర్బు మాకు.. ఆమె అతని భార్య అని, అది అతని ఇల్లే అని. “ముందు ఎందుకు చెప్పలేదు!?” అంటే.. “మీరు భోజనం ఎలా ఉందో చెప్పాక చెబుదామనుకున్నా!” అని చెణికాడు.
“భూటాన్ అందమైన దేశం, ఆనందకరమైన దేశం అంటున్నారు కదా.. ఎప్పుడూ ఇలాగే ఉంటుందా!?” అన్న నా ప్రశ్నకు నోర్బు జవాబు..“ఒకప్పుడు ప్రపంచానికి దూరంగా ఉన్నాం. ఈ మధ్యనే తలుపులు తెరిచి పర్యాటక దేశంగా మారాం. కానీ, ఈ మధ్య వెలుస్తున్న కొత్త కట్టడాలు, నిర్మాణాలు, పర్యాటకుల సందడి చూస్తుంటే.. మాకూ కొంత ఆదుర్దాగానే ఉంది. ఏం అభివృద్ధి జరుగుతుందో, ఎంత విధ్వంసం అవుతుందో!” అతని స్వరంలోని సన్నని విషాద జీర అర్థమై, ఏం మాట్లాడాలో తెలీక మౌనాన్ని ఆశ్రయించి.. అతనికి ‘కద్రిన్ చేలా (వీడ్కోలు)’ చెప్పి.. దివి నుంచి భువికి తిరుగు ప్రయాణం అయ్యాం.
రాజువయ్యా..
ఇక్కడ అడుగడుగునా రాజు, అతని కుటుంబం ఫొటోలు కనిపిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండటం వింతేం కాదు కానీ, ఇళ్లు, హోటళ్లు, దుకాణాల్లో ఎక్కడ చూసినా అవే ఫొటోలు. ఇంత స్వీయారాధన ఏంటా!? అనుకున్నాను. కానీ భూటాన్ ప్రజల హాపినెస్ ఇండెక్స్ చూశాక.. వారికి రాజు పట్ల ఉన్న ప్రేమ అర్థం అయింది. భూటాన్ రాణి ‘జెత్సునా పెమా’ ఒక విలక్షణమైన, దృఢమైన మహిళ. స్త్రీవాద ఉద్యమాలతోపాటు, శిశు సంరక్షణకు పాటుపడే అనేక అంతర్జాతీయ సంస్థలలో ఆమె క్రియాశీలకంగా పనిచేస్తున్నది.
– స్వర్ణ కిలారి