హైదరాబాద్, ఆగస్టు 22 ( నమస్తే తెలంగాణ ): బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఏ జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు పాదయాత్రలు చేసినా, మోకాళ్ల మీద నడిచినా రాష్ట్రంలో అధికారం దక్కదని చెప్పారు. ఎల్కే అద్వానీని పక్కనబెట్టి ఆదానీ, అంబానీలను అక్కున చేర్చుకున్న మోదీని నిలదీయాలన్నారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. హిందువులకు పవిత్రమైన పసుపుతోనే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయం చేశారని విమర్శించారు. పసుపు బోర్డును సాధించలేకపోతే ఆయనను పసుపు కడాయి కింద పాతిపెడతారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత గురించి మాట్లాడే స్థాయి అరవింద్కు ఉన్నదా అని ప్రశ్నించారు.
ఇకనైనా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు చెప్పారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలున్న అరవింద్ ఇంట గెలవకుండా రచ్చ గెలుస్తాడా అని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథను బీజేపీ మంత్రులు పొగిడిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీలు అవినీతికి కేరాఫ్ అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం 28 మంది అవినీతిపరులను దేశం దాటించిందని పేర్కొన్నారు. జైలుకెళ్లిన రేవంత్రెడ్డి కూడా అవినీతి గురించి మాట్లాడటమా? అని ఎద్దేవా చేశారు.