హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రైతు కమిషన్లోని ఉద్యోగులకు ఆరేడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమిషన్కు కేటాయించిన నిధులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహించడంతోనే సమస్య ఉత్పన్నమైందని కమిషన్ సభ్యులు వాపోతున్నారు. అధికారుల తీరుతో సకాలంలో వేతనాలు అందక అగచాట్లు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్లో కేటాయించిన నిధులు కావాలనే ప్రొవిజన్ పేరుతో అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. అధికారులు మాత్రం తమ కార్యక్రమాలను ఇష్టానుసారంగా నిధులను ఖర్చు చేస్తూ.. కమిషన్కు మాత్రం నిబంధనల పేరుతో అడ్డుతగులుతున్నారని పేర్కొంటున్నారు. ఇలాగైతే కమిషన్ కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యంకాదని వాపోతున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తాడోపేడో తెల్చుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.
రైతు కమిషన్లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో దాదాపు 30 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి రైతు కమిషన్కు కేటాయించిన నిధుల నుంచే వేతనాలు చెల్లించాల్సి ఉన్నది. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో దాదాపు ఆరేడు నెలలుగా వేతనాలు రావడం లేదని ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయాన్ని రైతు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. వేతనాలు విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతు కమిషన్కు రూ.8.5 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1.5 కోట్లు మాత్రమే అధికారులు, సిబ్బందికి జీతభత్యాలకు వినియోగించినట్టు తెలిసింది. మిగిలిన రూ.7 కోట్లు వెనక్కి వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. రైతు కమిషన్ నిర్వహించే సమావేశాలకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపించినా.. నిధుల విడుదలలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది 2026-2027 ఆర్థిక సంవత్సరానికి రూ. 10 కోట్లు కేటాయించారు. ఈ నిధులు కూడా గతేడాది మాదిరిగానే కాగితాలపైనే కేటాయింపులు చేసి.. వెనక్కి పంపుతారేమో అనే అనుమానాలు వెంటాడుతున్నాయి.