హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళా సంఘాలు ఇకపై డిజిటల్ రూపంలో తమ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. నాలుగు లక్షలకుపైగాఉన్న సంఘాలు, అందులోని 50 లక్షల మంది సభ్యుల వివరాలు, లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోకి మారాయి. దీనిని రియల్టైం బుక్కీపింగ్గా పిలవనున్నారు.
మహిళా సంఘాలన్నింటినీ డిజిటలైజ్డ్ చేసిన తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. డిజిటలైజ్డ్ సంఘాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు. 50 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యుల వ్యక్తిగత వివరాలతోపాటు, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఆర్థిక వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. దీని ద్వారా సంఘాల నిర్వహణలో పూర్తి పారదర్శకత రానున్నది. ఇప్పటివరకు పుస్తకాలలో రాస్తున్న వివరాలన్నింటినీ ఇకపై పూర్తిస్థాయిలో మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తారు. ఒక సంఘంలోని ఒకరికి దీని నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. వారి ఫోన్ నంబర్ను సెంట్రల్ సర్వర్లో నమోదు చేశారు. ఆ నంబర్ నుంచి యాప్లో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ యాప్పై మహిళా సంఘాలకు దశలవారీగా శిక్షణ ఇచ్చారు.
వివరాలన్నీ నమోదు
మహిళా సంఘాల్లోని సభ్యులందరి వ్యక్తిగత వివరాలను, వారి ఫొటోలతో సహా యాప్లో పొందుపర్చారు. సభ్యురాలు సంఘంలో ఎప్పుడు చేరారు, ఎంత మొత్తం పొదుపు చేశారు, బ్యాంకు రుణం మొత్తం ఎంత, ఎప్పుడు తీసుకున్నారు, తిరిగి ఎంత చెల్లించారు, ఏ రోజు చెల్లించారు, ఇంకా ఎంత మొత్తం చెల్లించాల్సి ఉన్నది తదితర వివరాలన్నింటినీ పొందుపరుస్తారు. వీటితోపాటుగా సమావేశాలు నిర్వహించుకొనే వివరాలు, అందుకు సంబంధించిన ఫొటోలు, రుణం తీసుకున్న మొత్తంతో ఏ వ్యాపారం నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించిన ఫొటోలను ఆప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఎస్హెచ్జీల సమగ్ర సమాచారం నిక్షిప్తం చేశారు. రుణం మొత్తం చెల్లించగానే ఆ వివరాలు ఇందులో ఆప్డేట్ అవుతాయి. గతంలో బ్యాంకు రుణాల మొత్తాన్ని సంఘం అధ్యక్షరాలు, కార్యదర్శికి ఇచ్చినవారు వెంటనే బ్యాంకుకు చెల్లించకపోవడంతో జాప్యమై వడ్డీ పెరిగేది. కొందరు తమ సొంత అవసరాలకు వాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాటికి ఆస్కారం లేకుండా డిజటలైజేషన్ ప్రక్రియ పాదర్శకతను పెంపొందిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్యాప్లో తమ పరిధిలోని సంఘాల సమాచారాన్ని సీసీలు, ఏపీఎంలు, డీపీఎంలు చూసుకునే అవకాశం ఉంటుంది. సంఘ సభ్యుల సమాచారం ఒక్క క్లిక్తో లభ్యంకానున్నది.