కరీంనగర్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణతో పోటీపడే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంటే చెప్పాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో వ్యవసాయాభివృద్ధికి ఏ పథకాలు అమలుచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో నిర్మించనున్న రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ భవనానికి శనివారం మంత్రులు నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, హరీశ్రావు, గంగుల కమలాకర్తో కలిసి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జమ్మికుంటలోని పత్తి మార్కెట్ యార్డులో నిర్వహించిన రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి సీఎం కేసీఆర్ శ్రమిస్తుంటే ఓర్వలేని విపక్ష నేతలు హద్దు, పద్దు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా మార్పురాలేదని, అభివృద్ధి జరగలేదని నిరూపించే దమ్ము ఎవరికైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. 40 లక్షల ఎకరాలకు నీళ్లియ్యగలిగే కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేండ్లలో పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కంటే ఈటల జూనియరేనని పేర్కొన్నారు. ఈటల కంటే రెండేండ్లు ముందుగానే గెల్లు టీఆర్ఎస్లోకి, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారని గుర్తుచేశారు. ఈటల అధికారంలో ఉన్నన్నాళ్లు నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టు వ్యవహరించారని, ఏ ఒక్కరోజూ నియోజవర్గానికి నలుగురు మంత్రులను తీసుకొచ్చి అభివృద్ధి చేయించలేకపోయారని విమర్శించారు. తన మెడికల్ కళాశాల అనుమతుల కోసం ఢిల్లీ వెళ్లడం తప్ప, హుజూరాబాద్కు ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయారని విమర్శించారు. గెల్లు శ్రీనివాస్ను గెలిపించి, అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్: మంత్రి హరీశ్
రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండానే 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్టుగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటుచేస్తామని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు హామీ ఇచ్చారు. రెడ్డి కులస్తుల్లోని పేదలకు కూడా కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్ వంటివి అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అన్ని వర్గాల్లోని పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. హుజూరాబాద్లో న్యాయానికీ అన్యాయానికీ.. ధర్మానికీ అధర్మానికీ మధ్య యుద్ధం జరుగుతున్నదని, రెడ్డి సోదరులు ధర్మయుద్ధం చేస్తున్న టీఆర్ఎస్ వైపు నిలబడాలని కోరారు. గెల్లు శ్రీనివాస్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయనను గెలిపిస్తే సొంత స్థలం ఉన్నవారికి డబుల్బెడ్రూం ఇండ్లు కట్టిచ్చే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. టీఆర్ఎస్ బలాన్ని చూసి బీజేపీ గుండెలు అదురుతున్నాయని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ సభలకు జనం ప్రభంజనంలా కదిలివస్తుంటే, చూసి ఓర్వలేక ఈటల రాజేందర్ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతుల కోసం రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయో బేరీజు వేయాలని కోరారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. వ్యవసాయ బావులు, బోర్లకు కరెంటు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చెప్తున్నదని, కాళేశ్వరం మీద పెత్తనానికి ప్రయత్నిస్తున్నదని చెప్పారు. డీజిల్ ధరలు పెంచి, వ్యవసాయాన్ని భారంగా మారుస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీని గెలిపిస్తే పెంచిన డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని దమ్ముంటే ఈటల చెప్పాలని సవాల్ విసిరారు.
అభివృద్ధి చూసి ఓటేయండి: మంత్రి సబిత
ప్రజాసంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్ఎస్కు ఓటేస్తారో, జనం జేబులకు చిల్లులు పెట్టి, నడ్డివిరుస్తున్న బీజేపీకి ఓటువేస్తారో ఆలోచించుకోవాలని విద్యాశాఖ మంత్రి సబిత్రాఇంద్రారెడ్డి కోరారు. రాష్ట్రం ఎనిమిదేండ్ల క్రితం ఎలా ఉ న్నదో, ఇప్పుడు ఎలా ఉన్నదో గమనించాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరికీ అందుతున్నాయని చెప్పారు. గతంలో మాదిరిగా విద్యుత్తు విషయంలో ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడటం లేదని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కోరుకున్న తెలంగాణ ఆవిష్కృతం అవుతున్నదని పేర్కొన్నారు.
నన్ను ఆశీర్వదించండి: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు
రెడ్డి కులస్తులతో తనకు విడదీయరాని అనుబంధం ఉన్నదని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. టీఆర్ఎస్లో తనను ప్రోత్సహించింది రెడ్డి నాయకులేనని, రెడ్డి కులస్తులు కమిట్మెంట్తో పనిచేస్తారని కొనియాడారు. ‘మీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా’ అని చె ప్పారు. దేశంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేంద్రం విఫలమైందని వి మర్శించారు. మన భవిష్యత్తును నిలబెట్టేది టీఆర్ఎస్ పార్టీనేనని చెప్పారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రు లు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, దాసరి మనోహర్రెడ్డి, ఒడితెల సతీశ్కుమా ర్, పాడి కౌశిక్రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, రెడ్డి సంఘం నాయకులు శ్రీధర్రెడ్డి, సంతోష్రెడ్డి, తుమ్మెటి సమ్మిరెడ్డి, ముద్దసాని కష్యప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
దేశంలో ఒక్క తెలంగాణలోనే రైతు సంక్షేమ ప్రభుత్వం ఉన్నదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి రైతు తలెత్తుకుని జీవిస్తున్నాడని చెప్పారు. కొందరు అబద్ధాలు, ఉద్దెర మాటలు చెప్తుంటారని, సీఎం కేసీఆర్ నగదు మాటలు మాట్లాడతారని అన్నారు. అన్ని సామాజికవర్గాలను సీఎం కేసీఆర్ ఒకే దృష్టితో చూస్తున్నారని, ఈ సభకు తాను స్పీకర్గా కాకుండా ఒక రెడ్డి బిడ్డగా హాజరయ్యానని చెప్పారు. తాను వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామంటే ఇతర రాష్ర్టాలవారు నమ్మలేదని అన్నారు. రైతుబంధు లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. బాన్సువాడలో తాను 5 వేల డబుల్బెడ్రూం ఇండ్లలో గృహప్రవేశాలు చేయించానని, సీఎంతో మాట్లాడి మరో 5 వేల ఇండ్లు మంజూరు చేయించుకున్నానని చెప్పారు. రాజకీయాధికారం అనేది కోట్లాదిమంది ఇచ్చిన అస్త్రమని, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడొద్దని విపక్ష నాయకులకు హితవు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని పథకాలు అమలుచేస్తుంటే ఇంతకన్నా ఎక్కువ ఇచ్చి మాట్లాడాలని సూచించారు.