రెండ్రోజుల నుంచీ జలుబు ఉన్నది.. ఒకసారి టెస్టు చేయించుకుంటే పోలా.. అనే వైఖరితో కొందరు! లక్షణాలేమీ కనిపించడం లేదు.. అసిమ్టమాటిక్ కాదు కదా.. అనే సందేహంతో మరికొందరు! కరోనా పాజిటివ్ రాగానే.. కంగారుగా ఆక్సిజన్ బెడ్లకోసం పరుగులు తీసేది మరికొందరు! ఇలా అవసరం లేనివారు కూడా పరీక్షా కేంద్రాలకు, దవాఖానలకు పరుగులు తీస్తుండటంతో నిజంగా పరీక్షల అవసరం ఉన్నవారు, దవాఖానల్లో పడకలు అత్యవసరం అయినవారు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. అత్యంత విలువైన వైద్య వనరులు దీనివల్ల వృథా అవుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు వ్యాధి లేకపోయినా అనుమానంతో పరీక్షల కోసం వస్తుండటంతో ఇతరుల నుంచి రోగాన్ని కొని తెచ్చుకుంటున్నట్టూ అవుతుందని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): అనుమానం పెనుభూతం అంటారు. పొద్దున్న లేస్తే వార్తా పత్రికలు, టీవీ చానెళ్లు కరోనా రోగులు, మృతుల గురించి హోరెత్తిస్తున్నాయి. దీంతో చాలామంది తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా.. కేవలం అనుమానంతో, చేతిలో డబ్బు ఉంది కదా అని.. ఒకసారి పరీక్ష చేయించుకుంటే పోతుంది కదా అనుకొని ఎటువంటి వైద్యుల సలహాలు లేకుండానే దవాఖానలు, ల్యాబ్ల వద్ద బారులు తీరుతున్నారు. వీరి అత్యుత్సాహం లేదా అవగాహన రాహిత్యం నిజమైన రోగులకు ప్రాణసంకటంగా మారుతున్నది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు మొదలు వైద్యసేవలు పొందడం వరకూ జాప్యం జరుగుతున్నది. వీరి మూలంగా ఎంతో విలువైన వైద్య వనరులు తరిగిపోతున్నాయి. మరికొందరు తమకు వైరస్ సోకకముందే ముందుజాగ్రత్తగా ఆక్సిజన్ సిలిండర్లను, రెమ్డెసివిర్ వంటి ఔషధాలను కొనుక్కొని ఇండ్లలో నిల్వ చేసుకుంటున్నారు. దీంతో నిజమైన వ్యాధిగ్రస్తులకు వాటి కొరత ఏర్పడుతున్నది. కొవిడ్ నిర్ధారణ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, దవాఖానల్లో బెడ్లు దొరక్క అసలైన బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరికి చికిత్సలో జాప్యం జరిగి ప్రాణాలు కోల్పోవాల్సిన విషాదకర పరిస్థితి నెలకొంటున్నది. వ్యాధి లక్షణాలు కనిపిస్తేనే దవాఖానలకు రావాలని, పరీక్ష చేయించుకోవాలని ప్రతిరోజు డాక్టర్లు మొత్తుకుంటున్నా ప్రజల వైఖరిలో మార్పు రావడంలేదు. వీరి అత్యుత్సాహం ఇతరులకు ప్రాణసంకటంగా మారుతున్నది.
వైద్యసేవల్లో తీవ్ర జాప్యం..
కరోనా సెకండ్వేవ్ అందరినీ భయకంపితులను చేస్తున్న విషయం వాస్తవమే. కానీ వైరస్ సోకినవారిలో నూటికి 98 మంది సాధారణ చికిత్సతో, హోం ఐసొలేషన్లోనే బాగైపోతున్నారు. వీరిలో చాలామందికి అసలు వ్యాధి లక్షణాలు కూడా కనిపించడంలేదు. అయినప్పటికీ వీరి కారణంగా డయాగ్నోస్టిక్ సెంటర్లు, దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. కొందరు కేవలం అనుమానంతో అనవసర ఆందోళనకు గురవుతూ కొవిడ్ లక్షణాలు లేకున్నా దవాఖానలకు పరుగులు తీస్తున్నారు. పరీక్షల కోసం, చికిత్స కోసం వస్తున్న వారిలో 80శాతానికి పైగా వీరేనని స్వయంగా వైద్యశాఖ అధికారులు వెల్లడిన్నారు. వీరి చైతన్యం ఆహ్వానించదగినదే అయినా.. వీరి వల్ల అసలైన బాధితులు అవస్థలకు గురవుతున్నారు. కొవిడ్ రోగులకు అవిశ్రాంతంగా సేవలందిస్తున్న వైద్యసిబ్బందిపై వీరి మూలంగా అనవసర పనిభారం పెరుగుతున్నది. డయాగ్నోస్టిక్ సెంటర్ల వద్ద పరీక్షల కోసం బారులు తీరడంతో వాటి ఫలితాలు రావడంలో మరింత జాప్యం జరుగుతున్నది. యాంటిజెన్ పరీక్ష ఫలితం వెంటనే వస్తున్నప్పటికీ కొందరు ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం పట్టుబడుతున్నారు. దీని ఫలితం రావడానికి కనీసం రెండురోజుల సమయం పడుతున్నది. దీంతో అసలైన బాధితుల ఫలితాలు ఆలస్యమై వైద్య సహాయం పొందలేక ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంటున్నది.
తరిగిపోతున్న వైద్యవనరులు
ప్రజల అత్యుత్సాహం, అనుమానం, అనవసర ఆందోళన మూలంగా విలువైన వైద్యవనరులు వృథాగా తరిగిపోతున్నాయి. ఎంతో విలువైన ఆర్టీపీసీఆర్, పీపీఈ కిట్లు వేల సంఖ్యలో వృథా అవుతున్నాయి. స్వల్ప లక్షణాలుండి, ఇండ్లల్లోనే వైద్య సహాయంతో కోలుకునే అవకాశాలున్నా.. కొందరు లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లకు అబద్ధాలు చెప్తూ దవాఖానల్లో చేరుతున్నారు. దీంతో దవాఖానల్లో బెడ్లన్నీ నిండిపోతున్నాయి. దీంతో అత్యవసర చికిత్స అవసరమైనవారికి బెడ్లు దొరకడంలేదు. ఇక ఆక్సిజన్ సిలిండర్లను కొందరు ముందస్తుగా కొనిపెట్టుకోవడంతో రీఫిల్లింగ్లో జాప్యం ఏర్పడుతున్నది.
భయాన్ని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు దవాఖానలు
జనాల్లో నెలకొన్న అనుమానాలు లేక భయాన్ని ప్రైవేటు దవాఖానలు ఇదే అదునుగా సొమ్ము చేసుకుంటున్నాయి. కాసులు దండుకోవడమే లక్ష్యంగా అనవసర పరీక్షలన్నీ చేస్తున్నాయి. డబ్బున్నవారైతే చాలు.. స్వల్ప లక్షణాలున్నా.. వారిని అడ్మిట్ చేసుకొని లక్షలు గుంజుతున్నాయి. అవసరం లేకున్నా వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తూ విలువైన ప్రాణవాయువును వృథా చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ప్రజలు అనుమానాలు, భయంతో.. మరోవైపు ప్రైవేటు దవాఖానలు డబ్బు సంపాదనపై యావతో విలువైన వైద్య వనరులను వృథా చేస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రజలు అనవసర భయాలకు లోనుకాకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరముందని అధికారులు పేర్కొంటున్నారు. ఎవరూ ఆందోళనకు గురికావొద్దని, ప్రభుత్వం అవసరమైనవారందరికీ వైద్య వనరులను సమకూర్చగలదని వివరిస్తున్నారు. ప్రస్తుత రీతిలోనే పరిస్థితులు కొనసాగితే.. వనరులన్నీ త్వరగా తరిగిపోయి అందరూ చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని, అప్పుడు అందరి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.