అద్భుత విజయం.. అంతకుమించి ప్రజల్లో అపరిమిత విశ్వాసం. పద్నాలుగేండ్లపాటు రాష్ట్రం కోసం పల్లేరుకాయలపై నడిచిన నాయకుడి వెన్నంటి నడిచింది తెలంగాణ. ఏడేండ్లుగా బంగారు తెలంగాణ కోసం పరితపిస్తున్న పాలకుడికి నీడై నిలిచింది తెలంగాణ. రాష్ట్రం వచ్చిన తర్వాత తమ బతుకులను తీర్చిదిద్దేది టీఆర్ఎస్సేనని నమ్మింది తెలంగాణ. కేసీఆరే సరైన న్యాయం చేస్తరని తన గుండెను తీసి ఆయన చేతుల్లో పెట్టింది తెలంగాణ.
ఏడేండ్లుగా ఎన్నో ఎన్నికలు జరిగాయి.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేటరూ.. కౌన్సిలరూ.. సర్పంచూ.. వార్డు మెంబరు.. ఒకటేమిటి.. ప్రతి ఎన్నికా కేసీఆర్ పట్ల, టీఆర్ఎస్ పట్ల ప్రజావిశ్వాసాన్ని ఇనుమడింపజేసిందే తప్ప.. పిసరంత తగ్గింది లేదు. కొండొకచో ఒకట్రెండు చోట్ల అభ్యర్థి లోపంతోనో, మరో కారణంతో కొంత తేడా వచ్చి ఉండవచ్చేమో కానీ.. 99.99% ఎన్నికల్లో విజయం కారు డోరు దిగనేలేదు. టీఆర్ఎస్ నీడగా తెలంగాణ తొలిగిపోనేలేదు.
రాష్ట్రం వచ్చిననాటి నుంచి ప్రతి ఘడియా.. ప్రజలకోసం ఆలోచించిన పాలకుడు సీఎం కేసీఆర్. అందుకేనేమో.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా దాదాపు 400 పైచిలుకు పథకాలు ప్రజల గడపలు తొక్కినయి. వారి సంక్షేమాన్ని సాధించినయి. పరిణతి కలిగిన వ్యవహారశైలి, నిర్మాణాత్మకమైన ఆలోచనా విధానం.. ఆయనలోని ఎనర్జీ, అన్నింటికీ మించి ఆయనలోని ఓపికకు అంతేలేదు. ఈ ఏడేండ్లలో కేసీఆర్కు పెరిగినంత ఆదరణ దేశంలో మరే ముఖ్యమంత్రికీ పెరుగలేదు. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సడలలేదు. అందుకే తెలంగాణలో ప్రతి ఎన్నికా.. గులాబీ పండుగే అవుతున్నది.
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలు మరోసారి విశ్వాసాన్ని ప్రకటించారు. టీఆర్ఎస్ వెంటే తెలంగాణ.. కేసీఆర్ వెంటే ప్రజలు అన్నమాట ఇంకొకసారి రుజువైంది. 2014లో రాష్ట్రం ఏర్పడిన క్షణం నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ పాలకుడిగా మారిన ఉద్యమనేతకు తెలంగాణ సమాజం వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. ఎవరెన్ని మాటలు మాట్లాడినా.. అవాకులు, చవాకులు పేలినా, సోషల్మీడియాలో బురద చల్లినా.. టీఆర్ఎస్పట్ల, సీఎం కేసీఆర్ పట్ల తెలంగాణ సమాజానికి ఉన్న అచంచల విశ్వాసం చెక్కు చెదరలేదు. ఒకట్రెండు మినహా అన్ని ఎన్నికల్లోనూ గులాబీదళం విజయకేతనాన్ని ఎగురవేస్తూనే ఉన్నది. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. 2014లో కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు భవిష్యత్తు అయోమయంలో ఉన్న సందర్భంలో జరిగిన ఎన్నికల్లోనే టీఆర్ఎస్కు 63 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికలనాటికి ఏకంగా 47% ఓట్లతో 88 స్థానాలను అప్పగించారు.
అన్ని ఎన్నికల్లో కారుదే జోరు
రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ప్రతి ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ను ప్రజలు భారీ మెజార్టీతో గెలుపిస్తూ వస్తున్నారు. చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దక్కడంలేదంటే టీఆర్ఎస్పట్ల విశ్వాసం ఎంత బలంగా ఉన్నదో అర్థమవుతుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు 11 చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. 2019 లోనూ 9 సీట్లతో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా అవతరించింది.
తప్పుడు ప్రచారాలకు చెంపపెట్టు
టీఆర్ఎస్, సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాల పిడివాదాలు, తప్పుడు ప్రచారాలను ప్రజలు నిర్దంద్వంగా తిప్పికొడుతున్నారు. ఎంత హంగామా చేసినా.. హడావుడిచేసినా, జాతీయస్థాయి నాయకులను తెచ్చినా ప్రతి ఎన్నికలోనూ కేసీఆర్ను ఆశీర్వదిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలు ఏడింటికి ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆరింటిలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందింది. ఏడు స్థానాల్లో మూడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే. ఈ మూడింటినీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇటీవలి శాసనమండలి ఎన్నికలతోపాటు.. తాజాగా నాగార్జునసాగర్ ఉపఎన్నికలోనూ కారు విజయదుందుభి మోగించింది. నాగార్జునసాగర్, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలను విశ్లేషిస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్కు కాంగ్రెస్, బీజేపీ పోటీ కాదని, కాలేవని మరోసారి స్పష్టమైంది.
నాడు తండ్రి చేతిలో.. నేడు తనయుడి చేతిలో
ఇప్పుడు నాగార్జునసాగర్ స్థానానికి ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తన తండ్రి దివంగత నోముల నర్సింహయ్య సాధించిన మెజార్టీ కంటే రెండింతలు అధికంగా సాధించారు. అంతేకాదు.. తండ్రి చేతిలో, తనయుడి చేతిలో ఓడిపోయిన రికార్డును జానారెడ్డికి మిగిల్చారు. ఇక్కడ బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. గత మార్చిలో జరిగిన గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ సిట్టింగ్ స్థానంలో మాజీ ప్రధాని పీవీ బిడ్డ వాణీదేవి టీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. మండలి ఏర్పడిన 2006 నుంచి వరుసగా నల్లగొండ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తున్నారు. ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి రెండోసారి గెలిచారు.
నాటి నుంచి నేటి దాకా..