హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): అత్యున్నత న్యాయస్థానాలు చెప్పినా కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల గణనకు నిరాకరించటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అభిప్రాయపడ్డారు. లోహియా సిద్ధాంతాలను అమలు చేస్తున్నామని చెప్పుకొనే రాష్ర్టాల కన్నా.. బీసీ సంక్షేమంలో తెలంగాణ వంద రెట్లు మెరుగ్గా ఉన్నదన్నారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ పనితీరు, భవిష్యత్ కార్యాచరణ, అమలవుతున్న సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలు మొదలైన అంశాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయాలను పంచుకున్నారు.
బీసీ కమిషన్తో మీకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఈ కమిషన్ కూర్పుపై మీ కామెంట్?
కమిషన్ సభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకసారి పనిచేసి, ఇప్పుడు చైర్మన్గా ఎంపికవటం అరుదైన అవకాశం. అదృష్టవశాత్తు సీఎం నాకు ఈ అవకాశం కల్పించారు. రాష్ట్ర సాధన ఉద్యమంతో మమేకమై, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న కిశోర్గౌడ్, శుభప్రద్పటేల్, ఉపేంద్రను కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ కూర్పును బట్టే రాష్ట్రంలో బీసీ కులాల అభ్యున్నతి పట్ల ప్రభుత్వ వైఖరి తేటతెల్లమవుతున్నది.
తెలంగాణ ఏర్పడకముందు, తర్వాత రాష్ట్రంలో బీసీల స్థితిగతుల్లో వచ్చిన మార్పులు.. మీ అనుభవం, పరిశీలన ఏమిటి?
గుణాత్మకమైన మార్పులు వచ్చాయని ఘంటాపథంగా చెప్పగలను. బీసీల స్థితిగతులపై జాతీయ స్థాయిలో వేసిన కాకాసాహెబ్ కాలేస్కర్, మండల్ కమిషన్ చేసిన అనేక సిఫారసులను అమలు చేయని ప్రభుత్వాలను చూశాం. వివిధ రాష్ర్టాల్లోనూ పలు కమిషన్లు సిఫారసులు చేశాయి. తమిళనాడులో అణగారిన వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావటానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. బీహార్, కర్ణాటక, తమిళనాడు, యూపీ వంటి పలు రాష్ర్టాలు తాము రామ్మనోహర్ లోహియా సిద్ధాంతాలను అమలుచేస్తున్నామని చెప్పుకొంటాయి. కానీ వాటన్నింటి కన్నా కొత్తగా ఏర్పడిన తెలంగాణ.. బీసీ కులాల అభ్యున్నతిలో వందరెట్లు ముందున్నది. విద్యా, సంక్షేమరంగాల్లో ఈ దేశానికే తెలంగాణ దిక్చూచిలా నిలబడింది.
అభివృద్ధి ఫలాలకు నోచుకోని అనేక బీసీ కులాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర తొలి బీసీ కమిషన్ 17 ఆశ్రిత కులాలను బీసీల జాబితాలో చేర్చాలని సిఫారసు చేస్తే తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఎంబీసీ కులాల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆర్థిక అసమానతలు తొలిగితేనే వివక్ష రహిత సమాజం సాధ్యమని బలంగా నమ్మే ప్రభుత్వ విధానాలే అందుకు నిదర్శనం. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల ద్వారా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. విదేశీ విద్యానిధి కింద రూ.20లక్షలు అందిస్తున్నది కూడా తెలంగాణే. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ‘500 గజాల స్థలం ఇవ్వండి. బీసీ కమ్యూనిటీకి ఉపయోగపడేలా భవనాన్ని నిర్మించుకుంటాం’ అని బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య, నేను ఇంకా కొంతమంది మర్రి చెన్నారెడ్డి నుంచి వైఎస్ రాజశేఖర్రెడ్డి దాకా ప్రతి ముఖ్యమంత్రిని కలిసి మొరపెట్టుకున్నా గజం జాగ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం బీసీల్లోని 40 కులాలకు అత్యంత ఖరీదైన ఉప్పల్ భగాయత్, కోకాపేటల్లో 82.30 ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.95.25 కోట్లను ఇచ్చి ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి పూనుకొన్నది.
బీసీ కులగణన చేయలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించింది. రాష్ట్రం చేయవచ్చని కొందరు సూచిస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
ఇది అసంబద్ధమైన వాదన. రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలు మాత్రమే చేస్తాయి. కేంద్రంలోని రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సెస్ జనగణన చేయాలి. దేశంలో 1930లో ఒకసారి, 2011లో మరొకసారి బీసీ గణన జరిగింది. వాటిని ఇప్పటికీ బయటపెట్టలేదు. తాజాగా బీసీ కులగణన చేయలేమని చెప్పటం దారుణం. పులులకు, సింహాలకు, కుక్కలకు లెక్కలున్నాయి కానీ బీసీల లెక్కలు లేవు. పరిమాణాత్మక సమాచారం లేకుండా న్యాయసమ్మత ఫలితాలు ఎలా సాధిస్తాం? ప్రజల జీవన ప్రమాణ స్థితిగతులను అంచనావేసి వాటికి అనుగుణమైన విధానాలను అమలు చేయాలంటే కచ్చితంగా ఎవరెంత మంది ఉన్నారు? వారి స్థితిగతులు ఏమిటి? అనేది తెలియాలి. అందుకు కచ్చితంగా కుల గణన చేపట్టాల్సిందే. అది కేంద్రమే చేయాలి.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలపై ఏమంటారు?
దేశ సంక్షేమ రంగానికి తెలంగాణ కొత్త పాఠాలు నేర్పిస్తున్నది. పారిశ్రామికీకరణే అభివృద్ధికి నిర్వచనంగా చెలామణి అవుతుంటే సంక్షేమ రంగం కూడా అభివృద్ధికి కొలమానమే అని తెలంగాణ రుజువు చేసింది. సంక్షేమ పథకాలతో ప్రజల కొనుగోలు శక్తిని పెంచటం ద్వారా జీడీపీ, జీఎస్డీపీ పెరుగుతాయని నిరూపించింది. పథకాల అమలుతో ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంటే ఇవ్వాళ కొంతమంది మేధావులు రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ స్పందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మార్పును గమనించకుండా నాలుగు గోడల మధ్య ఉండి ఇటువంటి కామెంట్లు చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతున్నది. ఇది సరైన విధానం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం.
బీసీ కమిషన్ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?
మాకు చేతి నిండా పని ఉన్నది. మొదటగా రాష్ట్రంలోని సామాజికవేత్తలు, ఆంత్రోపాలజిస్టులు, ఆర్థికవేత్తలు, దశాబ్దాలుగా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న కులసంఘాల ప్రతినిధులతో సమావేశమై బీసీకులాల స్థితిగతులపై అధ్యయనం చేస్తాం. ప్రభుత్వ శాఖల్లో కులాలవారీగా విద్యా, ఉద్యోగ రంగాల్లో అమలుచేసిన రిజర్వేషన్ల వివరాలు ఇవ్వాలని లేఖలు రాస్తాం. ఒక ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటుచేస్తాం. బ్యూరో ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, సెస్ సహా పలు సంస్థలతో సమావేశాలు నిర్వహించి అధ్యయనాలు చేస్తాం.