మహబూబ్నగర్, జూలై 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృష్ణానదిలో తెలంగాణ నీటి వాటాను అక్రమంగా తరలిస్తూ రెండు రాష్ర్టాల ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు సృష్టించేందుకు ఏపీ సీఎం జగన్, అక్కడి మంత్రులు ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ద్వారా అదనంగా 10 గేట్లు ఏర్పాటు చేసి 40 వేల క్యూసెక్కులకుపైగా నీటిని తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. అదీగాక రాయలసీమ లిఫ్టును అక్రమంగా నిర్మించి మరో 44 వేల క్యూసెక్కులు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
గురువారం మహబూబ్గర్ కలెక్టరేట్ ఆవరణలో మంత్రి శ్రీనివాస్గౌడ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ప్రజలకు ఇబ్బంది అవుతుందనే తాము ఏమీ మాట్లాడటం లేదని ఏపీ నాయకులు పేర్కొనడం విడ్డూరంగా ఉన్నదన్నారు. మిగులు జలాల తరలింపు పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా నీటిని తరలిస్తూ పాలమూరును ఎడారిగా మారిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నాలుగు గేట్లు ఉన్న పోతిరెడ్డిపాడు వద్ద అదనంగా 10 గేట్లు ఏర్పాటు చేసి అనుమతి లేని పెన్నా బేసిన్కు సైతం అక్రమంగా నీటిని తరలిస్తున్నారని గుర్తుచేశారు.
కేఆర్ఎంబీ మౌనం ఎందుకు?
ఏపీ సర్కార్ కృష్ణానది నుంచి పెన్నా బేసిన్కు నీటిని అక్రమంగా తరలిస్తున్నా కేఆర్ఎంబీ ఎందుకు మౌనంగా ఉన్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. విద్యుత్తు ప్రాజెక్టు అయిన శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపాలని కేఆర్ఎంబీ ఎలా లేఖ రాస్తుందన్నారు. మద్రాస్కు తాగునీటి పేరిట అనుమతి లేని ఆయకట్టుకు సైతం నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై కేంద్రం నుంచి పరిశీలనకు వచ్చిన వారిని ఏపీలో అడ్డుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తుంటే ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
సీమాంధ్రులను బాగానే చూసుకుంటున్నం..
తెలంగాణలోని సీమాంధ్రులను ఎంతో బాగా చూసుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క రోజైనా ఇబ్బంది కలిగిందా? అని ప్రశ్నించారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయంలోనూ సీమాంధ్రులకు చిన్న ఇబ్బంది కలుగలేదన్నారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులు, ఇతర రాష్ర్టాల ప్రజలకు కాలిలో ముళ్లుగుచ్చుకున్నా పంటితో తీస్తా అని కేసీఆర్ ఆనాడే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తాము ఎప్పుడూ సీమాంధ్రులకు అండగానే ఉన్నామని తెలిపారు. కానీ తెలంగాణకు ఆక్సిజన్ అవసరమై వైజాగ్ వెళ్తే అక్కడ ప్లాంట్ ఆపేశారని, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తిరుపతిలో ఓ అధికారి తెలంగాణ వారిని అవమానిస్తున్నారని, తెలంగాణ ఆర్టీసీ బస్సులను ఏపీలో బస్టాండు బయటే ఉంచి సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ట్యాంక్ బండ్లోని సీమాంధ్రుల విగ్రహాలు తొలగించామా?, పార్కులు, కాలనీల పేర్లేమైనా మార్చామా?, సీమాధ్రుల కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏమైనా ఆగాయా? అని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజంగా ఏపీ సీఎం జగన్కు సీమాంధ్ర ప్రజలపై ప్రేమ ఉంటే వెంటనే అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల పనులు ఆపేయాలన్నారు.