థానే, సెప్టెంబర్ 23: బాలిక వయసు పదిహేనేండ్లు. ప్రేమిస్తున్నాను అని ఒకడు వెంటపడ్డాడు. నమ్మింది. ఇద్దరూ శారీరకంగా కలిశారు. బాలికకు తెలియకుండా నిందితుడు వీడియో తీశాడు. వేరేవాళ్లకు చూపిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. తర్వాత కొన్ని రోజులకు తన మిత్రులకు చెప్పాడు. వాళ్లు ఆ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. వాళ్లు మరికొంత మందికి చెప్పారు. ఇలా నలుగురైదుగురు గుంపులు, గుంపులుగా.. మొత్తం 33 మంది ఎనిమిది నెలల పాటు ఆ బాలికను వేర్వేరు చోట్లకు తీసుకెళ్లి అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఎట్టకేలకు బాలిక ధైర్యం చేసి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. పోలీసులు 33 మందిపై కేసు నమోదు చేశారు.
ఇప్పటివరకు 26 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ‘బాలికను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వాడు జనవరి 29న లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి సెప్టెంబర్ 22 మధ్య ఆమెపై పలుమార్లు గ్యాంగ్రేప్ జరిగింది. బాధితురాలు 33 మంది నిందితుల పేర్లు చెప్పింది’ అని పోలీసులు తెలిపారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేశారు.