హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ, బోనాల పండుగలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రకృతితో కలిసి జీవించడం, ప్రకృతిని కాపాడుకోవడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మన సంప్రదాయాలు, ఆచారాలు, ప్రాచీన భారతీయ వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని చెప్పారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్లో ఆదివారం అలయ్ బలయ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే ఆలయ్ బలయ్ అన్నారు. కుల, మత, భాష, ప్రాంతీయ విభేదాలను పక్కనబెట్టి అందరూ కలసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పారు. అనంతరం సన్నాయి ఊది, డప్పుకొట్టి అలయ్ బలయ్ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అంతకుముందు దుర్గాదేవికి, జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే అలయ్ బలయ్లో పాల్గొనడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు గవర్నర్ మహిళలతో కలిసి నృత్యం చేశారు.
మన సంప్రదాయాలు దేశానికే ఆదర్శం: మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
మన సంస్కృతి, సంప్రదాయాలు దేశానికే ఆదర్శమని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి శ్రీనివాస్యాదవ్ అన్నారు. బండారు దత్తాత్రేయ రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకలను నిర్వహించడం, గవర్నర్గా వెళ్లినప్పటికీ ఆనవాయితీని కొనసాగించడం గొప్ప విషయమని చెప్పారు. భగవంతుడు ఆయనకు నిండు నూరేండ్ల్ల ఆయుష్షు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఎంపీ కేశవరావు మాట్లాడుతూ.. ఇది దత్తన్న అలయ్ బలయ్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి కార్యక్రమం జరిగినా దత్తన్నే గుర్తొస్తారని చెప్పారు.
దసరా స్ఫూర్తిని చాటిచెప్పే అలయ్ బలయ్: ఎమ్మెల్సీ కవిత
అలయ్ బలయ్ వేడుకలకు వీళ్లు, వాళ్లు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆహ్వానించి నిజమైన దసరా స్ఫూర్తిని ప్రజలకు గుర్తుచేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నో ఏండ్లుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్న దత్తాత్రేయ తనను ఆహ్వానించడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. అన్ని పార్టీల నాయకులు ఒకే వేదిక మీద ఇలా కలిసి కూర్చోవడం, ప్రజల కోసం అందరం నిలబడుతామనే మంచి సందేశాన్నిస్తుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు తప్ప శత్రువులు ఉండరని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత దత్తాత్రేయను ప్రత్యేకంగా సన్మానించారు. అంతకుముందు దత్తాత్రేయ మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు ఉన్నా అందరం కలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒక్కటిగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హిమాచల్ప్రదేశ్ గవర్నర్ రాజేంద్రవిశ్వనాథ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జనసేన అధినేత పవన్కల్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు కోట శ్రీనివాసరావు, వివిధ పార్టీల నాయకులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
పలువురికి సన్మానం
ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన, సామాజిక, సేవ కార్యక్రమాల్లో తమదైన ముద్ర వేసిన తెలుగువారిని అలయ్ బలయ్లో సత్కరించారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, రెడ్డిల్యాబ్స్ అధినేత ప్రసాద్రెడ్డి, ఏఐజీ దవాఖాన చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్, బయోలాజికల్ ఈ- వైస్ ప్రెసిడెంట్ మహిమ దాట్లను ఉపరాష్ట్రపతి సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన నాయకులు, ప్రముఖులను బండారు దత్తాత్రేయ శాలువాలు కప్పి సత్కరించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో ఆలింగనాలతో కాకుండా సమస్కారాలతో అలయ్బలయ్ నిర్వహించారు.