న్యూఢిల్లీ, మే 13: సుప్రీంకోర్టులో జరిగే విచారణలను ప్రత్యక్షప్రసారం జరిపే ప్రతిపాదనను తాను సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ గురువారం వెల్లడించారు. సుప్రీంకోర్టులో ఉన్న తన సహచరులతో చర్చించి, ఏకాభిప్రాయం తర్వాతే దీనిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో.. వర్చువల్గా విచారణలు జరుపుతున్న సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ను కోర్టు వ్యవహారాలు చూసే విలేకర్లకు కూడా తెలియజేసే యాప్ను జస్టిస్ రమణ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టు విచారణల వివరాలను సేకరించటానికి మీడియా వ్యక్తులు పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసన్నారు. దీనికోసం వారు లాయర్లపై ఆధారపడుతున్నారని తెలిసిందని చెప్పారు. ఈ సందర్భంగా తాను జర్నలిస్టుగా పని చేసిన అనుభవాన్ని వెల్లడించారు. ‘కొంతకాలంపాటు నేను జర్నలిస్టుగా పనిచేశా. ఆ రోజుల్లో కార్లు, బైకులు మాకు ఉండేవి కావు. ఏదైనా కార్యక్రమాన్ని కవర్ చేయటానికి వెళ్లినప్పుడు బస్సుల్లోనే వెళ్లేవాళ్లం. కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రయాణసాధనాలను వాడుకోకూడదని మాకు ఆదేశాలు ఉండేవి’ అని పేర్కొన్నారు.
కొత్తలో సాంకేతిక సమస్యలు రావొచ్చు
కొత్తగా తీసుకొచ్చిన యాప్లో తొలిరోజుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని, ఆ యాప్ను విలేకర్లు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సీజేఐ సూచించారు. ఏదైనా సమస్య తలెత్తినా.. దాన్ని పెద్దగా చేయరాదని, దానిని పరిష్కరించే సాంకేతిక బృందానికి సహకారం అందించాలని చెప్పారు. యాప్తోపాటు ‘ఇండికేటివ్ నోట్స్’ పేరుతో కొత్తగా తీసుకొచ్చిన మరో సదుపాయం గురించి కూడా జస్టిస్ రమణ వివరించారు. సుప్రీంకోర్టు వెలువరించిన అతిముఖ్యమైన తీర్పులను సాధారణ ప్రజలు, విలేకర్లు సులభంగా అర్థం చేసుకొనేలా.. ఆయా తీర్పులను సంక్షిప్తంగా, సరళంగా మార్చి ఇండికేటివ్ నోట్స్లో ఉంచుతామన్నారు. సుప్రీంకోర్టు వెబ్సైట్తోపాటు, కొత్తగా తీసుకొచ్చిన యాప్లో కూడా ఇది అందుబాటులో ఉంటుందన్నారు. మీడియా వ్యక్తులకు అక్రెడిటేషన్ ఇచ్చే విషయంలో స్పందిస్తూ.. ఈ ప్రక్రియను సరళతరం చేయటానికి ఇప్పటికే ఆదేశాలిచ్చానని, దీనిపై సుప్రీంకోర్టుకు, మీడియాకు మధ్య అనుసంధానంగా వ్యవహరించేలా ఒక సీనియర్ అధికారిని కూడా నియమించే ఆలోచన ఉందన్నారు.
పలువురు జడ్జీలకు కరోనా కాటు
దేశవ్యాప్తంగా చాలామంది జడ్జీలు, న్యాయాధికారులు కరోనా బారిన పడ్డారని సీజేఐ తెలిపారు. ‘106 మంది హైకోర్టు జడ్జీలు, 2,768 న్యాయాధికారులకు కరోనా సోకింది. సుప్రీంకోర్టులో 800 మంది రిజిస్ట్రీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఆరుగురు రిజిస్ట్రార్లు, 10 మంది అదనపు రిజిస్ట్రార్లున్నారు. ముగ్గురు హైకోర్టు జడ్జీలు, 34 మంది న్యాయాధికారులు, ముగ్గురు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అధికారులనూ కోల్పోయాం’ అని జస్టిస్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్లు డీవై చంద్రచూడ్, ఏఎం ఖన్విల్కర్, హేమంత్గుప్తా తదితరులు పాల్గొన్నారు.