న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: భారతదేశంలో 18 ఏండ్లు నిండిన ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని, అనుసరించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. బలవంతపు మతమార్పిళ్లను, చేతబడి వంటి తాంత్రిక విద్యలను కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకునేలా కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ స్పష్టతనిచ్చింది. జస్టిస్లు ఆర్ఎఫ్ నారీమన్, బీఆర్ గవాయి, హృషికేశ్ రాయ్తో కూడిన బెంచ్ దీనిపై శుక్రవారం విచారణ చేపట్టింది. ఇలాంటి పిటిషన్ను దాఖలు చేసినందుకు న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్, ఆయన తరుఫున వాదనలు వినిపించిన న్యాయవాది గోపాల్ శంకరనారాయణపై ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆర్టికల్ 32 ప్రకారం ఇది ఏ రకమైన పిటిషన్? ఇలాంటి పిటిషన్ను దాఖలు చేసినందుకు మీపై భారీ జరిమానా విధిస్తాం’ అని గోపాల్ శంకరనారాయణను ఉద్దేశిస్తూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. 18 ఏండ్లు నిండిన వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించకూడదు అనడానికి ఎలాంటి కారణం లేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో తన పిటిషన్ను వెనక్కి తీసుకోవడానికి అనుమతినివ్వాలని న్యాయవాది కోర్టును కోరారు. దీనికి న్యాయస్థానం నిరాకరిస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది.
బలవంతపు మతమార్పిడులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 25 కింద నేరం. బలవంతపు మతమార్పిళ్లను, తాంత్రిక విద్యలను కట్టడి చేయడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి’ అని అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. మతమార్పిడులతో మత సామరస్యాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు కమిటీని నియమించాలన్నారు.