హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారికి చిక్కి ప్రాణభయంతో వైద్యం కోసం మన రాష్ర్టానికి వస్తున్న రోగులకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. రోగుల సంఖ్య, చికిత్స సౌకర్యాలను క్రమబద్ధం చేస్తూ గురువారం మార్గదర్శకాలు జారీచేసింది. కొవిడ్ చికిత్స కోసం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారి కోసం విధివిధానాలను ఖరారు చేసింది. కొందరు ముందస్తుగా పడకలు బుక్చేసుకోకుండా, నేరుగా వచ్చి ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. బాధితులను అంబులెన్స్లలో పెట్టుకొని దవాఖానల చుట్టూ తిరుగుతున్నట్టు గుర్తించింది. దీంతో రోగులకు సరైన చికిత్స అందకపోవడం, విలువైన సమయం వృథాకావడంతోపాటు వారిద్వారా వివిధ రకాల వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్రూమ్ను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని దవాఖానతో తప్పనిసరిగా కొవిడ్ చికిత్స కోసం ఒప్పందం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని దవాఖానల నుంచి రోగుల వివరాలు, ఎలాంటి చికిత్స అవసరం వంటి అంశాలను నిర్ణీత ఫార్మాట్లో కంట్రోల్ రూమ్కు 040-2465119, 9494438351 ద్వారా కానీ, idsp@telangana. gov.inకు మెయిల్ ద్వారాగానీ పంపాలని కోరారు. వాటిని పరిశీలించిన అనంతరం కంట్రోల్ రూమ్ నుంచి అనుమతి పత్రం జారీ అవుతుంది. ఈ అనుమతి పత్రం ఉన్న రోగులను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది.