ప్రత్యేక ప్రతినిధి, మే 18 (నమస్తే తెలంగాణ): కనీవిని ఎరుగని కరోనా ప్రళయంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా తట్టుకుని నిలబడింది. కటిక ప్రతికూలతలు ఎదురైనా బడ్జెట్ అంచనాల్లో 70 శాతానికిపైగా రాబడులను సాధించి సత్తా చాటింది. కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో వాటా తగ్గినప్పటికీ సొంత పన్నుల రాబడిలో స్ధిరమైన వృద్ధిని నమోదు చేసుకుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరాంతానికి తెలంగాణ రాష్ట్రం దాదాపు రూ.లక్ష కోట్ల రెవెన్యూ రాబడులను సాధించింది. గడిచిన బడ్జెట్లో రూ.1.43 లక్షల కోట్ల రెవెన్యూ రాబడులు వస్తాయని అంచనా వేయగా.. కరోనా దెబ్బ వల్ల ఆ అంచనాను సవరించుకోవాల్సి వచ్చింది. 2020 మార్చిలో మొదలైన కరోనా మొదటి దశ ప్రళయం నుంచి తెలంగాణ కేవలం ఆరునెలల్లోనే తేరుకొని రూ.99,903 కోట్ల రెవెన్యూ రాబడులను సాధించింది.
అన్ని రకాల పన్నుల రూపంలో రూ.79,339 కోట్ల రాబడి వచ్చింది. ఇందులో రూ.64 వేల కోట్లకు పైచిలుకు ఆదాయం సొంత పన్నుల ద్వారా సమకూరింది. రెవెన్యూ రాబడులు, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్-ఇన్-ఎయిడ్, క్యాపిటల్ రాబడులు కలిపి మొత్తం రూ.1,45,599 కోట్లు సమకూరాయి. 2020-21 సంవత్సరంలో మొత్తం రాబడి రూ.1,32,508 కోట్లుగా ఉన్నది. గతంతో పోలిస్తే కరోనా సంక్షోభ సమయంలోనే రాబడి మరింత పెరగడం గమనార్హం. వాణిజ్య పన్నులు (జీఎస్టీ, వ్యాట్) ద్వారా రూ.50 వేల కోట్ల వరకు రాబడి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం నుంచి రాబడి తగ్గింది. ధరణి పోర్టల్ కొత్త విధానంతోపాటు వివిధ కారణాల వల్ల స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను కొంత కాలంపాటు నిలిపివేయడం ఇందుకు కారణం. ఈ విభాగం నుంచి దాదాపు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. కేవలం రూ.5,243 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. మరోవైపు ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ.14,369 కోట్లు రావడంతో మొత్తంగా సొంత పన్నుల ద్వారా రూ.64 వేల కోట్ల రాబడి వచ్చింది.
భారీగా తగ్గిన పన్నేతర ఆదాయం
గత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం భారీగా తగ్గింది. మొత్తంగా రూ.30 వేల కోట్ల రాబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం రూ.5,091 కోట్లు మాత్రమే సమకూరింది. కేంద్ర పన్నుల్లో వాటాగా కనీసం రూ.16 వేల కోట్లు వస్తాయని ఆశించగా.. అది రూ.13 వేల కోట్లు కూడా దాటలేదు. కానీ గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో మాత్రం రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.15 వేల కోట్లు సమకూరాయి.