50 లక్షల జనాభా కూడాలేని ఓ దేశం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా పీచమణిచింది. టీకా అందుబాటులోకి రాకముందే ఆ ఘనతను సాధించింది. ఆ దేశమే న్యూజిలాండ్. వైరస్ వ్యాప్తిని పసిగట్టడం, అప్రమత్తంగా వ్యవహరించడం, ముందస్తు లాక్డౌన్, కరోనా పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి ముఖ్యమైన చర్యలను పటిష్టంగా అమలు చేసి వైరస్ విముక్త స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నది. న్యూజిలాండ్లో కేవలం 2,613 కేసులే (మరణాలు 26) నమోదయ్యాయంటే, విశ్వమారి కట్టడిలో అక్కడి ప్రభుత్వం, ప్రజలు ఎంత నిబద్ధతతో వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.
కేసులు నిల్.. అయినా లాక్డౌన్
కరోనా కేసులు పెరిగాక అన్ని దేశాలు లాక్డౌన్ ఆంక్షలు విధించాయి. న్యూజిలాండ్ ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. దేశంలో తొలి కేసు నమోదుకాకముందే లాక్డౌన్ ఆంక్షలను తీసుకొచ్చారు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తూ 2020, ఫిబ్రవరి మూడో వారంలో స్థానికంగా లాక్డౌన్ విధించారు. అప్పటికి దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే, ఫిబ్రవరి 28, 2020న ఇరాన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా సోకినట్టు గుర్తించారు. ఇదే న్యూజిలాండ్లో తొలికేసు.
నాలుగు అంచెల్లో లాక్డౌన్
లాక్డౌన్ ఆంక్షలను పక్కాగా నిర్వహించిన దేశాల్లో న్యూజిలాండ్ ముందువరుసలో ఉంటుంది. నిత్యావసరాలు, వైద్యసర్వీసులు మినహా అన్ని సేవలను రద్దు చేశారు. హెచ్చరికలను నాలుగు అంచెలుగా అమలుచేశారు. లెవల్ 4లో (తీవ్రమైన ఆంక్షలు) భాగంగా అందరూ ముఖానికి మాస్కులు, భౌతిక దూరం పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కొందరికి జైలు శిక్ష కూడా వేశారు. ప్రజల కోసమే తామిదంతా చేస్తున్నట్టు ప్రభుత్వం బాహాటంగానే ప్రకటించింది.. అలా మే, 2020 నుంచి దేశంలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. ప్రభుత్వం-ప్రజల భాగస్వామ్యంతో వ్యాక్సిన్ అందుబాటులోకి రాకముందే అంటే 2020 జూన్ మొదటి వారంలోనే ‘కరోనా ఫ్రీ’ దేశంగా న్యూజిలాండ్ నిలిచింది.
పండుగ చేస్కున్నారు
50 వేల మందితో దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ స్టేడియంలో న్యూజిలాండ్ అధికారులు ఇటీవల లైవ్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించారు. ‘ప్రపంచమంతా మహమ్మారి గుప్పిట్లో ఉన్నా.. మేము మాత్రం సాధారణ జీవితాలు గడపగలమని మా నగరం నిరూపించింది. కరోనా నిబంధనలు పాటిస్తే, ఇది అందరికీ సాధ్యమే’ అని ఆక్లాండ్ మేయర్ ఫిల్ గోఫ్ పేర్కొన్నారు. నిజమేగా!
ట్రేసింగ్ అంటే ఇది..
వ్యక్తులకు లక్షణాలు లేనంతమాత్రాన వైరస్ సోకలేదని చెప్పలేమని తొలిసారిగా ప్రపంచానికి చెప్పిన దేశం న్యూజిలాండ్. కరోనా బాధితుల కాంటాక్ట్ ట్రేసింగ్ చర్యలను యుద్ధప్రాతిపదికన సేకరించారు. ఒక్కో కేసులో 300 నుంచి 500 మంది వివరాల్ని సేకరించడం విశేషం. ఇలా గుర్తించిన ప్రతి బాధితునికి అవసరమైన చికిత్స అందించారు. రోగులకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని ఎప్పటికప్పుడు అందించారు.
నాలుగు అంచెల వ్యూహమిదే
లెవల్ 4
(వైరస్ ఉద్ధృతి )-ఇంట్ల నుంచి బయటకు రావొద్దు. మాస్కులు ధరించాలి.. లేకపోతే జరిమానా.
లెవల్ 3
(వైరస్ వ్యాప్తి)-థియేటర్లు, లైబ్రరీలు మూసివేత.. అవసరముంటేనే బయటకు రావాలి. మాస్క్లు తప్పనిసరి.
లెవల్ 2
(వైరస్ కేసుల్లో తగ్గుదల)-మాస్క్లు పెట్టుకొని షాపింగ్కు వెళ్లొచ్చు. భౌతిక దూరం పాటించాలి.
లెవల్ 1
(వైరస్ ఫ్రీ)-సాధారణ జీవితం గడుపొచ్చు.