న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశంలో వ్యాక్సిన్ల కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. విదేశాల్లో తయారై, ఆమోదం పొందిన టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం వివరాలు వెల్లడించింది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు లోబడి తయారై.. అమెరికా, ఐరోపా, బ్రిటన్, జపాన్ తదితర దేశాల్లో ఇప్పటికే అనుమతులు పొందిన టీకాలకు అత్యవసర వినియోగం కింద అనుమతులు ఇవ్వాలని నిర్ణయించాం’ అని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ‘విదేశాల్లో ఆమోదం పొందిన టీకాలను భారత్లో అనుమతించే ముందు.. తొలుత 100 మంది లబ్ధిదారులకు ఇచ్చి వాటి సురక్షితంపై ఏడు రోజులపాటు విశ్లేషణ జరుపుతాం’ అని తెలిపింది. విదేశీ టీకాలపై స్థానికంగా నిర్వహించే ట్రయల్స్ స్థానంలో ‘బ్రిడ్జింగ్ క్లినికల్ ట్రయల్స్’ నిర్వహించి.. ఆ సమాచారం ఆధారంగా అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించింది. వ్యాక్సిన్లపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం (ఎన్ఈజీవీఏసీ) సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.
విదేశాల్లో అనుమతి పొందిన టీకాకు స్థానిక అనుమతులు లభించాలంటే లోకల్ ట్రయల్స్ (వ్యాక్సిన్పై స్థానికంగా ప్రయోగాలు) నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి సమయం ఎక్కువగా పడుతుంది. దీంతో ఈ ట్రయల్స్ స్థానంలో ‘బ్రిడ్జింగ్ ట్రయల్స్’ను తీసుకొచ్చారు. వ్యాక్సిన్ను కొత్తగా ఒక దేశంలోకి తీసుకొచ్చేందుకు క్లినికల్ డేటా ఆధారంగా చేసే ప్రయోగాలనే ‘బ్రిడ్జింగ్ ట్రయల్స్’ అంటారు. వేర్వేరు జాతుల ప్రజలపై వ్యాక్సిన్ పనితీరు ఏ విధంగా ఉన్నదో తెలుసుకునేందుకు ఈ ట్రయల్స్ సాయపడుతాయి. సాధారణ ట్రయల్స్లో జరిపినట్టు ఈ ట్రయల్స్ను పూర్తి స్థాయిలో నిర్వహించరు. సమర్థత, భద్రత తదితర అంశాల్లో టీకా పనితీరు సరిగ్గా ఉందో లేదో ఈ ట్రయల్స్లో నిర్ధారిస్తారు. ఇప్పటి వరకు భారత్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ (స్పుత్నిక్ వీ కోసం) మాత్రమే బ్రిడ్జింగ్ ట్రయల్స్ నిర్వహించింది.
భారత్లో ఇప్పటికే మూడు టీకాలు (కొవిషీల్డ్, కొవాగ్జిన్, తాజాగా స్పుత్నిక్ వీ) అనుమతులు పొందాయి. వ్యాక్సినేషన్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను వినియోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరికొద్ది రోజుల్లో మరిన్ని టీకాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే), నోవావాక్స్, జైడస్ క్యాడిలా టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: రష్యాకు చెందిన ‘స్పుత్నిక్ వీ’ వ్యాక్సిన్కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నుంచి అనుమతి లభించినట్టు హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ తెలిపింది. అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతులు లభించినట్టు వెల్లడించింది. రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) ‘స్పుత్నిక్ వీ’ను అభివృద్ధి చేయగా, ఈ టీకాను భారత్లో విక్రయించేందుకు ఆ సంస్థతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకున్నది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్యా భారత్లో ఏటా 85 కోట్ల టీకా డోసులను ఉత్పత్తి చేయనున్నట్టు ఆర్డీఐఎఫ్ ప్రతినిధులు తెలిపారు. భారత్తో కలిపి తమ వ్యాక్సిన్ను 60 దేశాలు అనుమతించినట్టు వివరించారు. కాగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు దేశంలో ఇప్పటికే అనుమతులు లభించడం తెలిసిందే.
వ్యాక్సిన్ పేరు తయారీదారు అవసరమైన సమర్థత ఎవరికి ఇవ్వొచ్చు అనుమతించిన ధర
డోసులు దేశాలు
ఫైజర్ ఫైజర్-బయోఎన్టెక్ (అమెరికా) రెండు 95 శాతం 16 ఏండ్లు పైబడిన వారికి 82 రూ.1,470
మోడెర్నా మోడెర్నా (అమెరికా) రెండు 94 శాతం 18 ఏండ్లు పైబడిన వారికి 46 రూ.1,130
జాన్సన్ అండ్ జాన్సన్ జాన్సన్ అండ్ జాన్సన్ (నెదర్లాండ్స్) ఒకటి 66 శాతం 21 ఏండ్లు పైబడిన వారికి 40 రూ.750
నొవావాక్స్ నొవావాక్స్ (అమెరికా) రెండు 89.3 శాతం 21 ఏండ్లు పైబడిన వారికి – రూ.1,200
జైడస్ క్యాడిలా జైడస్ గ్రూప్ (భారత్) రెండు 76 శాతం 21 ఏండ్లు పైబడిన వారికి – రూ.150
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13:రాష్ర్టాలు, పాలిత ప్రాంతాల (యూటీల) వద్ద ఇప్పటికీ 1.67 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. అసలు సమస్య టీకా కొరత కాదని మెరుగైన ప్రణాళిక లేకపోవడమని పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ర్టాలు, యూటీలకు 13,10,90,370 డోసుల సరఫరా జరిగిందని తెలిపింది. వృథాతో కలిపి 11,43,69,677 డోసులను వినియోగించాయన్నది. ‘ప్రస్తుతం రాష్ర్టాలు, యూటీల వద్ద 1,67,20,693 డోసులు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఏప్రిల్ ఆఖరు వరకు రాష్ర్టాలు, యూటీలకు 2,01,22,960 డోసులు సరఫరా అవుతాయ’ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వివరించారు. మరోవైపు, టీకా నిల్వలు అయిపోవడంతో ఒడిశాలోని 11 జిల్లాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేసినట్టు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. సోమవారం నుంచి మంగళవారం నాటికి 24 గంటల వ్యవధిలో 1,61,736 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కు చేరింది. వ్యాధిబారిన పడిన వారిలో తాజాగా 879 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,71,058కి పెరిగింది. మరోవైపు తాజాగా వెలుగుచూసిన కొత్త కేసుల్లో దాదాపు 80 శాతం కేసులు 10 రాష్ర్టాలు.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. ఇప్పటివరకు 10,85,33,085 కరోనా టీకా డోసులను ప్రజలకు ఇచ్చినట్లు వివరించింది.