న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకు పైగా కేసులు నమోదుకాగా, 10 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. శుక్రవారంనాటికి మొత్తం 20.65 కోట్ల కేసులు నమోదుకాగా, 43.6 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇరాన్లో కేసులు పెరుగుతున్నాయి. 135కు పైగా దేశాల్లోకి విస్తరించిన డెల్టా వేరియంట్ కారణంగానే ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతున్నప్పటికీ, డెల్టా విజృంభణతో అమెరికా, బ్రిటన్ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అగ్రరాజ్యంలో రోజూవారీ కేసులు లక్షన్నర దాటుతుండగా, బ్రిటన్లో రోజూ సుమారు 35 వేల కేసులు నమోదవుతున్నాయి. కరోనా తొలిసారిగా వెలుగుచూసిన చైనాలోనూ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజూవారీ కేసులు వంద మార్కును దాటుతుండటంతో మహమ్మారి కట్టడికి అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు బయటకు రాకుండా బయటినుంచి తాళాలు, ఇంటి తలుపులకు అడ్డుగా ఇనుపరాడ్లను పెట్టి దిగ్బంధిస్తున్నారు.
భారత్లోనూ..
భారత్లోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,120 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కు చేరింది. కొత్తగా 585 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,30,254కు చేరింది. 3,13,02,345 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 97.46 శాతంగా నమోదైంది. ఇప్పటివరకూ 52.95 కోట్ల టీకా డోసులనిచ్చినట్టు కేంద్రప్రభుత్వం తెలిపింది. ఇదిలాఉండగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో తొలి డెల్టా ప్లస్ మరణం నమోదైంది. బాధిత మహిళ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఈ మరణం సంభవించడం గమనార్హం. మహారాష్ట్రలో ఈ వేరియంట్తో ఇప్పటికే మరో ఇద్దరు మరణించారు.
వుహాన్ ల్యాబ్లో ఏముందో ఎవరికి తెలుసు?
చైనాలో తొలి కరోనా కేసు నమోదు అయినట్టుగా భావిస్తున్న వుహాన్ చేపల మార్కెట్ సమీపంలోని వైరాలజీ ల్యాబ్ భద్రతా ప్రమాణాలపై డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్త బెన్ ఎంబారెక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనవరిలో ఓ కాన్ఫరెన్స్ కాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘ల్యాబ్లో పనిచేసేవారికి తగిన నైపుణ్యం, అక్కడ ప్రమాణాలకు తగిన విధంగా భద్రత ఉన్నాయో..లేవో ఎవరికి తెలుసు’ అని అన్నారు. ఈ మేరకు డెన్మార్క్ టీవీ చానల్ టీవీ2 గురువారం ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.