హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు ఎంతో గొప్ప పథకమని కితాబిచ్చారు. ఈ పథకాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. పథకం అమలుతో దళితుల జీవితాలు పూర్తిగా మారిపోతాయనడంలో ఎలాంటి సందేహంలేదని పేర్కొన్నారు. దళిత బంధు అమలులో సీఎం కేసీఆర్ నిర్ణయాలకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. దళిత బంధు విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్ని పార్టీలకు హితవుపలికారు.
దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు పలకాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలుచేస్తూ.. ప్రతి దళిత కుటుంబానికి న్యాయంజరిగేలా చూడాలని కోరారు. ఇంటి కి రూ.10 లక్షలు ఇచ్చేది సోమరిపోతులు కావాలని కాదని, ఈ పథకం అమలు వెనుక మంచిఉద్దేశం ఉన్నదన్నారు. ఎవరి అనుభవానికి తగ్గట్టు వారు ఈ డబ్బును ఉపయోగించుకుంటే దళితుల్లో పేదరికం అంతరిస్తుందని తెలిపారు. వ్యాపారాలు ప్రారంభించి.. వారు బతకడమే కాకుండా మరో 10 మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదుగుతారని సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంది కాబట్టే.. మాట ప్రకారం దళితుల ఉన్నతికి మేలైన పథకం అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు.