హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి టీకాలు వేసేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి భారీగా పెరుగుతున్నందున మన రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు.
ఆదివారం ప్రగతిభవన్లో వైద్యారోగ్యశాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని, ఇకనుంచి విద్య, వైద్యానికే పెద్దపీట వేస్తామని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీలు, దవాఖానల నిర్మాణం వెంటనే పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే టీకాలు వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యక్ష ప్రారంభమైనప్పటికీ కరోనా ప్రభావం పెద్దగా లేదని ఈ సందర్భంగా వైద్యాధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కరోనా కేసులు పెరిగే అవకాశం లేదని వివరించారు.
రాష్ట్రంలో వ్యాక్సిన్కు అర్హులు 2.80 కోట్లమంది ఉండగా, ఇప్పటికే కోటి 42 లక్షల మందికి మొదటి డోసు, 53 లక్షల మందికి రెండో డోసు వేసినట్టు తెలిపారు. మరో కోటి 38 లక్షల మందికి సింగిల్ డోసు వేయాల్సి ఉన్నదని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్లో గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, డీపీవో లు, జెడ్పీ సీఈవోలు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి వైద్య సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.
సర్పంచ్ల సేవలు ప్రశంసనీయం
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో గ్రామాల్లో లాక్డౌన్లు పెట్టుకోవడంతోపాటు రోగుల కోసం సూళ్లలో ఐసొలేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్లు ప్రజలకు అండగా నిలిచారని సీఎం కేసీఆర్ అభినందించారు. ఇప్పుడు చేపట్టబోయే వ్యాక్సినేషన్ స్పెషల్డ్రైవ్లో కూడా చురుకుగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతంచేయటానికి జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు, సమీక్షలు నిర్వహించాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు. వ్యాక్సినేషన్ సిబ్బందికి భోజనం, ఇతర వసతులు కల్పించాలని సూచించారు. వ్యాక్సినేషన్ సెంటర్లుగా సూళ్లు, కాలేజీలు, రైతు వేదికలు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను ఉపయోగించుకోవాలని, అవసరమైన చోట్ల టెంట్లు వేసి శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు.
టీకాపై నిర్లక్ష్యం వద్దు
టీకా ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదనే విషయాన్ని ప్రజలంతా గమనించాలని సీఎం కోరారు. కరోనా లక్షణాలు ఉండి వెంటనే అప్రమత్తమైనవారు త్వరగా కోలుకొన్నారని, నిర్లక్ష్యం చేసినవారు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెప్తున్నాయని సీఎం పేర్కొన్నారు. లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని పీహెచ్సీల్లో పరీక్షలు చేయించుకోవాలని, మాసులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. భవిష్యత్తులో కరోనా, ఇతరత్రా సీజనల్ వ్యాధులు వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్లు, బెడ్స్ ఏర్పాటు విషయంలో కచ్చితమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
ఇక నుంచి విద్య, వైద్యంపై దృష్టి
ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చామని, ఇకపై వైద్యం, విద్యపై దృష్టి పెడుతామని సీఎం తెలిపారు. మెడికల్ కాలేజీలు, మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలను త్వరగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రోగులకు ఎనలేని సేవలందిస్తున్న నిమ్స్ దవాఖాన పరిధిలో మరో రెండు టవర్స్ నిర్మించి వైద్యసేవలను విసృ్తతం చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే జీ విఠల్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు, సెక్రటరీలు స్మితా సబర్వాల్, రాజశేఖర్రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెల్త్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వీ, డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో వ్యాక్సిన్కు అర్హులు 2.80 కోట్ల మంది
మొదటి డోసు తీసుకున్న వారు 1.42 కోట్ల మంది
రెండు డోసులు తీసుకున్న వారు 53 లక్షల మంది