న్యూఢిల్లీ: త్వరలోనే పదో తరగతి పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు CBSE బోర్డు కసరత్తు చేస్తున్నది. జులై 20 నాటికల్లా ఫలితాలను వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే రద్దయిన 12వ తరగతి పరీక్షల తుది ఫలితాల వెల్లడికి అనుసరించే మూల్యాంకన విధానాన్ని CBSE బోర్డు సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో CBSE పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ మాట్లాడుతూ.. జులై 20కి పదో తరగతి పరీక్షల ఫలితాలు, జులై 31 నాటికి 12వ తరగతి ఫలితాలను వెల్లడించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అందువల్ల పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరద్వాజ్ చెప్పారు. ‘వీలైనంత త్వరలో CBSE పదో తరగతి ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఫలితంతో ఏ విద్యార్థి అయినా సంతృప్తి చెందకపోతే పరీక్ష రాసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్లను త్వరలోనే ప్రారంభిస్తాం. సమయానుకూలంగా పరీక్ష కేంద్రాలను కేటాయిస్తాం. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు.
CBSE పదో తరగతి పరీక్షల ఫలితాలను ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా ప్రకటించనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను cbse.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాగా, గతేడాది జులై 15న CBSE పది ఫలితాలు విడుదల చేశారు.