కరోనా పట్ల ప్రజలు అతిగా భయపడటం సరికాదని స్టార్ హాస్పిటల్ కార్డియాలజీ నిపుణుడు డాక్టర్ మన్నం గోపీచంద్ పేర్కొన్నారు. భయమే చాలామందికి గుండెపై ప్రభావం చూపుతున్నదని చెప్పారు. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూ, వ్యాధిపై పూర్తి అవగాహన ఉంటేనే కరోనా నుంచి బయటపడగలమన్నారు. ‘సగం మందిలో భయం ఎక్కువగా ఉంది. వైద్యపరమైన అవగాహన లేనివారు లేనిపోని భయాలకు లోనవుతున్నారు. మానసికంగా సమతుల్యంగా లేనివారు ప్యానిక్ ఎటాక్కు గురవుతున్నారు. కరోనా మృతుల్లో ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారే ఎక్కువగా ఉంటున్నారు’ అని వివరించారు. కరోనా రోగులకు గుండెపోటు రావడం, హృద్రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్ గోపీచంద్ నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవీ వివరాలు..
పాజిటివ్ వచ్చినవారిలో 80% మందికి స్వల్ప లక్షణాలుంటాయి. కొందరిలో తెలియకుండానే వ్యాధి నయమైపోతుంది. ఐదుశాతం మంది వైద్యుడిని సంప్రదించి, మందులు వాడితే తగ్గిపోతుంది. మిగిలిన 15% మందిలో న్యుమోనియో, ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ కనిపిస్తున్నది. వీరికి వైద్యుల సూచనమేరకు చికిత్స అందించాలి. 5% మందిలో వైరస్ తీవ్రంగా ఉండటం వల్ల విషమస్థితికి దారితీస్తున్నది. వీరిని ఐసీయూలో ఉంచి ఇతర విధానాల్లో వైద్యసేవలు అందించాలి. వ్యాధి ముదిరినవారు, గుండె జబ్బు, మధుమేహం, కిడ్నీ, క్యాన్సర్ వంటి వ్యాధులున్నవారు క్రిటికల్ కండీషన్కు చేరుకుంటారు. వీరిలోనూ 1, 2% మందే మృత్యువాత పడుతున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి.
గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోతే పరిస్థితి విషమిస్తుంది. శరీరంలో రక్తం గడ్డకట్టే అవకాశాలు పెరుగుతాయి. అటువంటి సమయంలో హార్ట్ఎటాక్ వంటిది రావచ్చు. ఊపిరితిత్తుల్లోనూ రక్తం గడ్డ కట్టుకుపోతుంది. దాన్ని త్రంబోసిస్ అంటారు. దీనివల్ల హార్ట్ రైట్ సైడ్పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు అది గడ్డకట్టే పరిస్థితి ఉండకూడదు. ఉందంటే ఏ అవయవానికి అయితే రక్తం పోతుందో దాని పనితీరు దెబ్బతింటుంది. గుండె కండరాల్లో రక్తం గడ్డకడితే గుండె పనితీరు దెబ్బతింటుంది. రక్త కణాల్లో రక్తం ప్రవహించేటపుడు గడ్డ కట్టదు. అయితే ఈ వైరస్ వల్ల.. గడ్డ కడితే శరీర అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉన్నది.
ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు కరోనా పట్ల పూర్తి అవగాహనతో వైద్య సేవలు అందిస్తున్నారు. మొదటి దశకన్నా.. రెండో దశలో కొవిడ్ బారిన పడుతున్నవారు అధికశాతం మంది కోలుకుంటున్నారు. వ్యాధి తీవ్రంగా ఉండి హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న వారికి రెమ్డెసివిర్, స్టెరాయిడ్స్ వాడతాం. మోతాదు ఎక్కువగా వాడాల్సి వస్తే అటువంటి వారి శరీరంలో సాల్ట్, గ్లూకోజ్ ఇతర మెటబాలిక్ మెకానిజం అన్ బ్యాలెన్సింగ్ వల్ల ఆసిడ్ ఫామ్ అవుతుంది. ఇది గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది అందరిపై ఒకేలా ఉండదు స్టెరాయిడ్స్ వాడటం వల్ల బీపీ, షుగర్, గుండె ఇతర సమస్యలున్న వాళ్లకు ఇబ్బంది. ఆ వ్యాధి తీవ్రతను నియంత్రించాల్సి ఉంటుంది.
-హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ
కరోనా లక్షణాల్లో ప్రత్యేకంగా గుండె సమస్య అంటూ గుర్తించలేదు. ఆ వ్యాధి లక్షణాల్లో రక్తం గడ్డలు కట్టే స్వభావం ఉంటుంది. రక్తం కాళ్లల్లో గడ్డ కడితే అది కాళ్ల నుంచి రక్త ప్రవాహం ద్వారా గుండెకు, అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశం ఉంటుంది. దీన్ని పల్మనరీ ఎంబాలిజమ్ అంటారు. దీనివల్ల ఇదివరకే పల్మనరీ, హార్ట్ సమస్య ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కరోనా సోకినవారిలో వ్యాధి తీవ్రత ఉంటే న్యుమొనైటిస్ వల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల వల్ల కూడా హార్ట్రేట్ పెరుగుతుంది. ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి హార్ట్ మజిల్స్పై ఉండే ఇన్ఫ్లామేషన్ వల్ల గుండెపై ప్రభావం పెరగొచ్చు.
కరోనా తీవ్రంగా ఉంటే.. అప్పటికే గుండె సంబంధ వ్యాధులున్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హార్ట్ పంపింగ్ సమస్య, స్టంట్, హార్ట్ బైపాస్ సర్జరీ, ఇతర సమస్యలున్న వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ప్రత్యేకంగా గణాంకాలు లేకపోయినా.. ఆయా కారణాల వల్ల కరోనా సోకిన వారు క్రిటికల్కు చేరుకుంటున్నారు. ముందే గుర్తించి వైద్య సేవలు అందించడం వల్ల చాలామంది కోలుకున్నారు.
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ (చికిత్స కన్నా నివారణ ఉత్తమం) అని ఎప్పుడో ఓ మహానుభావుడు చెప్పాడు. ప్రస్తుత కొవిడ్కు ఇది వందశాతం వర్తిస్తుంది. మాస్క్ తప్పనిసరిగా ధరించడమే కాకుండా ఇతరులు కూడా వేసుకునేలా ప్రోత్సహించాలి. పరిశుభ్రత పాటించాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బయటివారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అందరూ పాటిస్తే.. సొసైటీ అంతా పాటించినట్లు. వ్యాధి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. అక్కడి నుంచి వైద్యులకు వదిలేయండి. రెమ్డెసివర్ దొరకడం లేదు, నేను చనిపోతాను అనుకోవద్దు. చాలామందికి రెమిడెసివర్ అవసరం లేదు. అది డాక్టర్ నిర్ణయిస్తారు. భయపడొద్దు.. నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయని మాత్రం గుర్తించండి.