మద్దతు ధరపై ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలుచేసి తీరుతామని 2014 ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన నరేంద్రమోదీ, అధికారం దక్కగానే ఆ మాటే మర్చిపోయారు. ఇదే అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు నిలదీయటంతో ఆ సిఫారసులు అమలు చేయటం సాధ్యంకాదంటూ కేంద్రం చేతులెత్తేసింది. తనకు నచ్చిన పెట్టుబడిదారుల కంపెనీలు కష్టాల్లో ఉన్నాయనగానే అమాంతం వాలిపోయి.. అమితమైన ప్రేమ చూపి కోట్లకు కోట్ల రూపాయల ప్రజల సొమ్ము కుమ్మరించే బీజేపీ సర్కారు, కోట్లమంది రైతుల జీవనాధారాన్ని కనీసం పట్టించుకోవటం లేదు. ఫలితంగా.. మద్దతు ధర అనేది ఒక మాయగా మారిపోయి.. రైతాంగాన్ని మోసం చేస్తున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): మాటలు కోటలు దాటుతున్నయ్.. పని మాత్రం పిసరంత కూడా కదలటంలేదు. దేశంలో అన్ని పంటలను మద్దతు ధరకు సేకరిస్తున్నామని ఊదరగొడుతున్న కేంద్ర ప్రభుత్వం, ఏటా ఇచ్చే పంటలకు కూడా సరిగా ఎమ్మెస్పీ ఇవ్వటంలేదు. 23 పంటలకు మద్దతు ధర అందిస్తున్నామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఏడెనిమిది పంటలకు మాత్రమే దక్కుతున్నది. మిగిలిన పంటలను కేంద్రం కొనుగోలుచేయడం లేదు. అందుకే ప్రతి పంటకు ఎమ్మెస్పీ దక్కేలా ప్రత్యేక చట్టం చేయాలని ఏండ్ల తరబడి రైతులు డిమాండ్చేస్తున్నా కేంద్రం కనీసం పట్టించుకొన్న పాపాన పోలేదు. ఎమ్మెస్పీ చట్టం చేస్తే రైతులకు తాము పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకొనే హక్కు వస్తుంది. ప్రతి పంటను కేంద్రం ఎమ్మెస్పీకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యాపారులూ మద్దతు ధర చెల్లించాల్సి వస్తుంది. అందుకే అధికారంలోకి రాకముందు మద్దతు ధరపై స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చిన నరేంద్రమోదీ, ఆ తర్వాత దాన్ని బుట్టదాఖలు చేశారు.
కొన్ని పంటలకే ‘మద్దతు’ అమలు చేస్తున్న కేంద్రం, అందులోనూ షరతులు పెడుతున్నది. వరి, గోధుమ, పత్తి మినహా మద్దతు ధర గల ఇతర పంటలను పరిమితంగానే సేకరిస్తున్నది. మొత్తం పంటలో 25 శాతమే తీసుకొంటున్నది. వాస్తవానికి 23 పంట ఉత్పత్తులకు మద్దతు ధర లభించాలి. కానీ వరి, గోధుమ, పత్తి, కందులు, పెసర్లు, పల్లి, సోయాబీన్, పొద్దు తిరుగుడు, బార్లీ పంటలకే మద్దతు ధర దక్కుతున్నది. తెలంగాణ, ఏపీలో ప్రధానమైన మిరప, పసుపు పంటలకు మద్దతు ధర కల్పించలేదు. ఎర్రజొన్న, చెరకు, ఉల్లిగడ్డకు కూడా ‘మద్దతు’ లేదు. మద్దతు జాబితాలో ఉన్నప్పటికీ మక్కలు, జొన్న సేకరణను 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే నిలిపేసింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేంద్రం చేతులెత్తేయడంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి మద్దతు ధరకు మక్కలు, జొన్నలు కొంటున్నది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎమ్మెస్పీ విధానం తూతూ మంత్రంగాఅమలవుతున్నది. తెలంగాణలో మాత్రం వంద శాతం మద్దతు దక్కుతున్నది. వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర్లు, మినుములు, పొద్దు తిరుగుడు, వేరుశనగ, సోయాబీన్ వంటి పదికిపైగా పంటలను పౌరసరఫరాల సంస్థ, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. పంజాబ్, హర్యానాలో ప్రభుత్వాలు వరి, గోధుమను మాత్రమే మద్దతు ధరకు సేకరిస్తాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లో వరిని మాత్రమే కొంటున్నాయి. అది కూడా కేంద్రం హామీ ఇచ్చిన మేరకే. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎకరాకు 15 క్వింటాళ్ల ధాన్యమే కొనుగోలు చేస్తున్నది. అంతకు మించి దిగుబడి వస్తే తీసుకోదు. మధ్యప్రదేశ్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది.
తెలంగాణలో అన్ని పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొంటుండటంతో ఇతర రాష్ర్టాల రైతులు పంటను ఇక్కడికి తెచ్చి అమ్ముకొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మక్కలను మద్దతు ధర క్వింటాలుకు రూ.1,850 చెల్లించి కొనుగోలు చేస్తున్నది. బీహార్, యూపీలో రైతులు రూ.1,000-1,200లకు క్వింటాలు అమ్ముతున్నారు. ధాన్యానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధర రూ.1,960 ఇస్తుండగా, పొరుగు రాష్ర్టాల్లో రూ.1,500-1,600 మాత్రమే లభిస్తున్నది. అందుకే కొన్ని రోజులుగా ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి ధాన్యం రవాణా పెరిగింది. దీంతో ఇక్కడి రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ర్టాల నుంచి పంట ఉత్పత్తులు రాకుండా అడ్డుకొంటున్నది.
ఎమ్మెస్పీకి స్వామినాథన్ సూత్రం
రైతుల జీవితాలు బాగుచేయాలంటే పంటలకు మద్దతు ధర ఉండాలని సూచించిన స్వామినాథన్ కమిషన్, అది ఎలా ఉండాలో స్పష్టంగా వివరించింది. ఒక పంట సాగుకు అయ్యే పెట్టుబడి, సాగు చేసేందుకు రైతు కుటుంబం చేసే శ్రమ మొత్తం విలువ ఎంత ఉంటుందో దానికి మరో 50% అదనంగా కలిపి (C2+50%) మద్దతు ధరను నిర్ణయించాలని సూచించింది. కేంద్రం నియమించిన శాంతకుమార్ కమిటీ కూడా వ్యవసాయ ఉత్పత్తులకు తక్కువ ధరలు ఉన్నచోట కేంద్రం కచ్చితంగా మద్దతు ధర కల్పించి సేకరించాలని సూచించింది. 2007 నుంచి 2014 వరకు వంద శాతానికి పైగా మద్దతు ధర పెరగగా, 2013 నుంచి 2022 వరకు 50%లోపే పెరుగుదల నమోదైంది. అంటే కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక మద్దతు ధర పెంపులో తీవ్ర వివక్ష కనిపిస్తున్నది.