అయ్లట్, డిసెంబర్ 13: అవమానాలను లెక్క చేయలేదు. ఎవరెంత తక్కువ చేసి మాట్లాడినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొన్నది. చిన్నప్పటి నుంచి కన్న కలను నిజం చేసుకొనే దిశగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగింది. ఫలితం.. విశ్వ సుందరి కిరీటం తన సిగలో చేరి మురిసిపోయింది. చండీగఢ్కు చెందిన మోడల్ హర్నాజ్ సంధూ భారత పతాకాన్ని విశ్వ వేదికపై రెపరెపలాడించారు. 21 ఏండ్ల తర్వాత దేశానికి విశ్వ సుందరి కిరీటం తీసుకొచ్చారు. హర్నాజ్ వయస్సు కూడా 21 ఏండ్లే కావడం యాదృచ్ఛికం. హర్నాజ్ కంటే ముందు భారత్ నుంచి 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా విశ్వ సుందరి కిరీటం గెలుచుకొన్నారు. ‘నాకు ఎల్లవేళలా మద్దతునిచ్చిన తల్లిదండ్రులకు, మిస్ ఇండియా ఆర్గనైజేషన్కు కృతజ్ఞతలు. దేశానికి 21 ఏండ్ల తర్వాత కిరీటాన్ని తీసుకురావడం చాలా గర్వంగా ఉంది’ అని హర్నాజ్ అన్నారు. విశ్వ కిరీటం గెలుచుకొన్న హర్నాజ్పై ప్రశంసల జల్లు కురిసింది. పలువురు సెలెబ్రిటీలు ఆమెను అభినందించారు. తల్లిదండ్రులు ప్రీతమ్ సింగ్ సంధూ, రవీందర్ కౌర్ సంధూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్, మాజీ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ హర్నాజ్ను అభినందించారు.
అయ్లట్లో సంబురాలు
70వ మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయెల్లోని అయ్లట్లో సోమవారం అట్టహాసంగా జరిగాయి. 79 దేశాల నుంచి యువతులు ఇందులో పాల్గొన్నారు. మాజీ విశ్వ సుందరి ఆండ్రియా మెజా.. హర్నాజ్కు కిరీటం తొడిగారు. ఈ పోటీల్లో పరాగ్వేకు చెందిన నదియా ఫెర్రీరా(22) రెండవ స్థానంలో, దక్షిణాఫ్రికాకు చెందిన లాలేలా స్వానే(24) మూడో స్థానంలో నిలిచారు. మిస్ యూనివర్స్ ఈవెంట్ను ఇజ్రాయెల్ నిర్వహించడం ఇదే తొలిసారి.
17 ఏండ్లకే మోడలింగ్లోకి
హర్నాజ్ సంధూకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే ఆసక్తి. నటిగా వెండితెరపై రాణించాలని ఆమె ఎన్నో కలలు కనేది. ఇందుకు చిన్నప్పటి నుంచే మోడలింగ్లో శిక్షణ తీసుకొన్నారు. 17 ఏండ్ల వయస్సులో మోడలింగ్లోకి వచ్చారు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నారు. 2017లోనే చండీగఢ్ తరఫున ప్రాతినిధ్యం వహించి టైమ్స్ ఫ్రెష్ ఫేస్ అవార్డును గెలుచుకొన్నారు. 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్, తర్వాత 2021లో లివా మిస్ దివా యూనివర్స్ టైటిల్ను సాధించారు. కొన్ని పంజాబీ సినిమాల్లో కూడా నటించారు.
సన్నగా ఉన్నావ్.. అన్నారు
శరీరాకృతి విషయంలో టీనేజీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని హర్నాజ్ పలు వేదికలపై చెప్పారు. ‘నువ్వు చూడటానికి సన్నగా ఉంటావు.. నీ శరీరం ఎందుకు అలా ఉంది..’ అంటూ పలువురు తనపై విమర్శలు చేశారని, వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని ముందడుగు వేశానని ఆమె అన్నారు. హర్నాజ్ ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.
అందుకే ఇక్కడ ఉన్నా..
పోటీల్లో చివరి అంకం ప్రశ్నలు-జవాబులు రౌండ్లో వాతావరణ మార్పు, యువతపై సోషల్ మీడియా ప్రభావం, ఒత్తిడిపై ప్రశ్నలు అడిగారు. యువత ఒత్తిడిని జయించాలంటే ఏం సలహా ఇస్తారు అని అడగ్గా.. ‘యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య వారిపై వారికి నమ్మకం లేకపోవడమే. ప్రపంచంలో జరిగే ముఖ్యమైన అంశాలపై మీతో మీరు చర్చించుకోండి. నేను నాపై నమ్మకం ఉంచాను. అందుకే ఇక్కడ నిలబడ్డాను’ అని సమాధానం ఇచ్చారు.
గౌనును డిజైన్ చేసింది ట్రాన్స్విమన్
ఫైనల్స్లో హర్నాజ్ ధరించిన గౌనును ట్రాన్స్విమన్, డిజైనర్ సాయిషా షిండే డిజైన్ చేశారు. ఈ డిజైనర్ పేరు అంతకుముందు స్వప్నిల్ షిండే. ఇటీవల పేరును మార్చుకొన్నారు. అనేక మంది బాలీవుడ్ స్టార్లకు కాస్ట్యూమ్లు డిజైన్ చేశారు.