హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆంధ్రజ్యోతి మరోసారి తెలంగాణపై అక్కసు వెళ్లగక్కింది. వ్యవసాయరంగంలో అద్భుత విజయాలు సాధిస్తున్న అన్నదాతపైనే దుష్ప్రచారానికి తెగబడిందని పలువురు రైతులు, విశ్లేషకులు అంటున్నారు. వరి ఎక్కువగా సాగుచేసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఆనాడు అన్నపూర్ణగా కీర్తించిన నోటితోనే.. ఇప్పుడు అదే వరిసాగును రికార్డుస్థాయిలో చేస్తున్న తెలంగాణను కాలుష్య కార్ఖానా అం టూ శాపనార్థాలు పెడుతున్నదని మండిపడుతున్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతులను కాలుష్య కారకులంటూ నిందిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘సుస్థిరత వ్యవసాయ కేంద్రం’ వారి అధ్యయనం పేరిట ప్రామాణికతగానీ, వాస్తవికతగానీ లేని సమాచారాన్ని గుమ్మరించి, తెలంగాణ బ్రాండ్ను దెబ్బతీసే కుట్రలకు తెరలేపింది. ఎకరం సాగు వల్ల 10 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్కు సమానమైన గ్రీన్హౌజ్ వాయువులు విడుదలవుతాయని, తెలంగాణ రైతులు 10 కోట్ల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తున్నారంటూ విషపూరిత కథనాన్ని ప్రచురించడంపై తెలంగాణ రైతుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
వరిసాగులో రెండో స్థానం
వరి ధాన్యం ఉత్పత్తిల్లో దేశంలో ప్రథమస్థానంలో ఉన్న పంజాబ్ ఏటా దాదాపు మూడు కోట్ల టన్నుల దిగుబడి సాధిస్తున్నది. ఏటా దాదాపు రెండున్నర కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకొన్న తెలంగాణ ఇప్పుడు 2వ స్థానానికి ఎగబాకింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలుచేస్తు న్న విధానాలు, ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, సాగునీటి వనరుల పెంపుదల, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు ఇందుకు దోహదం చేశాయి. తెలంగాణ రైతులకు వ్యవసాయం చేతకాదంటూ ఉద్యమ సమయంలో శాపనార్థాలు పెట్టిన ఆంధ్ర మీడియాకు ఇప్పుడు ఈ విజయా లు మింగుడుపడటం లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా కీర్తించేవారు. ఇప్పుడు ఆ ఘనతను తెలంగాణ సాధించింది. ఇదే ఇప్పుడు ఆంధ్ర మీడియాకు మింగుడుపడటం లేదు. అందుకే కాలుష్యం సమస్య ఇప్పుడు తెర మీదకొస్తున్నది. కోస్తాంధ్రలో వరిసాగు గురించి ఏనాడూ పల్లెత్తు మాట అనని ఆంధ్రజ్యోతి ఇప్పుడు తెలంగాణలో వరిసాగు వల్ల కాలుష్యం పెరుగుతున్నదని విషపురాతలకు పూనుకొంటున్నది.
ప్రామాణికత లేని అధ్యయనం
వరి నుంచి కార్బన్ డై ఆైక్సెడ్ విడుదలవుతుందని గతంలో కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఎవరైనా ఒక అంశంపై అధ్యయనం చేయాలంటే దానికి కొన్ని నిబంధనలు, ప్రమాణాలు పాటించాలి. నిర్దిష్టమైన గణాంకాలతో విశ్లేషించాలి. ఆయా రంగాలకు సంబంధించిన వివిధ సంస్థల సహకారం తీసుకోవాలి. సుస్థిర వ్యవసాయ కేంద్రం ఇవేవీ పట్టించుకున్నట్టు లేదని పలువురు పరిశీలకులు అంటున్నారు. అసలు ఆ సంస్థ ఏమిటి? దాని ప్రామాణికత ఏమిటి? అధ్యయనం ఎలా చేశారు? ఏయే రాష్ట్రాల్లో లేదా జిల్లాల్లో చేశారు? ఎవరి సహాయం తీసుకొన్నారు? గణాంకాలు ఎప్పటివి సేకరించారు? అధ్యయనంలో అనుసరించిన శాస్త్రీయ విధానం ఏమిటి? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండానే ఆంధ్ర మీడియా కథనం రాసిందని, తెలంగాణను బద్నాం చేసేందుకు పూనుకొన్నదని అంటున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం అధ్యయన ఫలితాలను ఆ సంస్థ వెబ్సైట్లో పెట్టలేదు. అధికారికంగానూ విడుదల చేయలేదు. అసలు విషయం ఆరా తీసేందు కు ప్రయత్నిస్తే ఆ సంస్థ ప్రతినిధులు అందుబాటులోకి రాలేదు. అధ్యయనం శాస్త్రీయత గురించి ప్రశ్నలు లేవనెత్తుతుండటంతో సమాధానాలు చెప్పలేక ముఖం చా టేసినట్టు వ్యవసాయరంగ నిపుణులు భావిస్తున్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై ఇప్పటికే ప్లాన్
వరిసాగు వల్ల కాలుష్యం పెరుగుతున్నది కాబట్టి, పంట మార్పిడి అనివార్యమని ఆంధ్రజ్యోతి నీతులు చెప్తున్నది. నిజానికి, వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ఇప్పటికే రైతువేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలను చేపట్టడంతోపాటు రైతుల అభిప్రాయాలను సేకరించింది. ఈ యాసంగిలో కనీసం 30 శాతం విస్తీర్ణంలో వరిసాగును తగ్గించేందుకు వ్యవసాయశాఖ కృషి చేస్తున్నది. వేరుశనగ, మినుము, పెసర, శనగ తదితర పంటలను కనీసం 7.50 లక్షల ఎకరాల్లో అదనంగా సాగుచేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. వేరుశనగ 2 లక్షల ఎకరాల్లో, మినుము 1.82 లక్షల ఎకరాల్లో, పెసరను 3 లక్షల ఎకరాల్లో, శనగ 51వేల ఎకరాల్లో, మొక్కజొన్న 40వేల ఎకరాల్లో సాగుచేయాలని ప్రణాళికలు రూపొందించింది.
హరితహారం కనిపించదా?!
తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 360 కోట్ల మొక్కలు నాటి, రికార్డు సృష్టించింది. ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా అంతర్జాతీయ సంస్థలు ప్రశంసిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 4 శాతం పచ్చదనం పెరిగింది. దీంతో వాతావరణంలో కార్బన్ డై ఆైక్సెడ్ శాతం తగ్గి, ఆక్సిజన్ శాతం పెరిగింది. ఇది ఆంధ్ర మీడియాకు కనిపించడం లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హరితహారం వల్ల కార్బన్ డై ఆైక్సెడ్ శాతం తగ్గుతున్నదని ఏనాడూ రాయడానికి మనసురాలేదని అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నా ఏనాడూ ప్రశంసించలేదని, కానీ, వరిసాగు విషయంలో వ్యతిరేక కథనాలు రాసేందుకు ఉత్సాహపడిందని పలువురు మండిపడుతున్నారు. తెలంగాణ బాగు పడితే చూడలేని తనాన్ని, ఆకుపచ్చగా మారితే ఓర్వలేని తనాన్ని బయటపెట్టుకొంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.