పాట్నా, మే 20: ఓ పక్క కరోనా సెకండ్వేవ్.. మరోపక్క బ్లాక్ ఫంగస్.. వీటితోనే దేశమంతా అతలాకుతలం అవుతుంటే.. మూడోముప్పు ముంచుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే.. వైట్ ఫంగస్. బీహార్ రాజధాని పాట్నాలో ఇప్పటివరకూ నాలుగు వైట్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పాట్నాకు చెందిన ప్రముఖ వైద్యుడు కూడా ఉన్నారు. ఊపిరితిత్తులతో పాటు ఇతర శరీర భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఈ వ్యాధి.. బ్లాక్ ఫంగస్ కంటే ఎక్కువ ప్రమాదకరమైనదని వైద్యులు చెబుతున్నారు.
నవజాత శిశువులు, పిల్లలు, మహిళలు, క్యాన్సర్ రోగులకు ఈ వ్యాధి సోకితే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కరోనా తరహా లక్షణాలు కనిపించడంతో నలుగురు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించామని పాట్నా మెడికల్ కాలేజీ, దవాఖాన మైక్రోబయాలజీ చీఫ్ డాక్టర్ ఎస్ఎన్ సింగ్ తెలిపారు. అయితే, వారిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ కాలేదని, దీంతో హెచ్ఆర్సీటీ స్కాన్ నిర్వహించగా ఊపిరితిత్తుల్లో వైట్ ఫంగస్ ఉన్నట్టు తెలిసిందన్నారు. బాధితులకు యాంటీ-ఫంగల్ ఔషధాలు ఇచ్చామని, ప్రస్తుతం వాళ్లు కోలుకున్నట్టు వివరించారు.
వైట్ ఫంగస్ ప్రాథమిక లక్షణాలేంటి?
మహిళల్లో అయితే తరుచూ జననాంగం నుంచి తెల్లని శ్లేష్మంలాంటి ద్రవం కారడం (ల్యూకోరోయా అని అంటారు), నవజాత శిశువుల్లో మర్మావయం వద్ద తెల్లని, ఎర్రని మచ్చలు ఏర్పడటం (డయపర్ క్యాండియాసిస్), పిల్లలు, పెద్దల్లో నాలుకపై, నోటిలో ఎర్రని పూతపూయడం.
ఎవరికి సోకే ప్రమాదం ఎక్కువ?
ఆక్సిజన్ సపోర్ట్తో కొవిడ్-19 చికిత్స తీసుకుంటున్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు, దీర్ఘకాలంగా స్టెరాయిడ్లను తీసుకుంటున్నవారు.
ఏ అవయవాలపై ప్రభావం?
ఊపిరితిత్తులతో పాటు గోర్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, నోరు, మర్మాంగాలపై వైట్ ఫంగస్ ప్రభావం చూపొచ్చు. అందుకే ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కట్టడి చేసే మార్గాలేవి?
ఆక్సిజన్ పరికరాలను, వెంటిలేటర్లను సరిగ్గా శానిటైజ్ చేస్తే వైట్ ఫంగస్ నుంచి రక్షణ పొందొచ్చు.
ఆ నీటితో వైట్ ఫంగస్?
ఆక్సిజన్ సిలిండర్కు అనుసంధానించే హ్యుమిడిఫయర్లో కొందరు నల్లా నీళ్లను వాడుతున్నారని డాక్టర్ ఎస్ఎన్ సింగ్ తెలిపారు. ఈ నీటిలో వైట్ ఫంగస్ ఉండే అవకాశమున్నదని, ఇది కరోనా రోగుల ఛాతిలోకి ప్రవేశించే ప్రమాదమున్నదన్నారు. సూక్ష్మజీవులు లేని శుద్ధమైన నీటినే హ్యుమిడిఫయర్లో వాడాలని సూచించారు.