హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఏర్పాటైన నూతన జిల్లాల్లో శాశ్వత ప్రాతిపదికన జీపీఎఫ్ ఖాతాలను ప్రారంభించాలని పీఆర్టీయూ టీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో కొనసాగుతున్న ఈ ఖాతాలను 32 జిల్లాలకు బదలాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిషత్తు టీచర్ల జీపీఎఫ్ ఖాతాలను నూతన జిల్లాల వారీగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సందీప్కుమార్ స్పందిస్తూ.. జెడ్పీ జీపీఎఫ్ ఖాతాలను ప్రారంభించాలని కమిషనర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు, సందీప్కుమార్ సుల్తానియాకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, వచ్చే మే, జూన్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెందిన రూ.700 కోట్లకు పైగా పెండింగ్ బిల్లుల్లు మంజూరు చేయనున్నట్టు ఆర్థిక శాఖ అధికారులు హామీనిచ్చినట్టు వారు పేర్కొన్నారు.