హైదరాబాద్ సిటీబ్యూరో/వెంగళరావునగర్/ఖైరతాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం ప్రగతిభవన్ ముట్టడి పేరుతో రోడ్డుపై నానా హంగామా చేశారు. దీంతో రాజ్భవన్, పంజగుట్ట, ఎస్సార్నగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో సామాన్యులు తీవ్ర ట్రాఫిక్ కష్టాలకు గురయ్యారు. పోలీసులు ఆమెకు వెనక్కి వెళ్లాలని నచ్చచెప్పినా ఆమె బెట్టు చేసి రోడ్డుపైనే కార్యకర్తలతో ఆందోళన చేశారు. ప్రగతిభవన్ను ముట్టడించాలంటూ అరుస్తూ, కేకలు వేస్తూ, పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. ఆమెను కారు దిగాలని కోరినా.. వాహనంలోనే మొండికేసి కూర్చోవడంతో పోలీసులు చేసేది లేక ఆమె వాహనాన్ని ట్రాఫిక్ క్రేన్ సహాయంతో ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీస్స్టేషన్ వద్ద ఆమె మరోసారి న్యూసెన్స్ చేశారు. కారును బలవంతంగా తెరిచి ఆమెను స్టేషన్లోకి తరలించారు. మంగళవారం 12.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సోమాజిగూడ, పంజగుట్ట, ఎస్సార్ నగర్ ప్రాంతంలో షర్మిల, ఆమె కార్యకర్తలు హంగామా చేశారు. మధ్యాహ్నం నుంచి జరిగిన హంగామా, ప్రజలకు ఇబ్బందుకు గురిచేయడం, పోలీసుల విధులకు ఆటంకం కల్గించడం తదితర అంశాలపై పంజగుట్ట పోలీసులు 341, 290, 506, 509, 336, 353, 382, 143 రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, షర్మిలతో పాటు ఆమె పీఆర్వో శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందుజారెడ్డి, శ్రీను, ముషారఫ్, సుధారాణి, సంజుకుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. విచారించిన న్యాయమూర్తి ఆమెకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరుచేశారు.
వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలతో పోలీసులు షర్మిల పాదయాత్రను ఆపి, ఆమెను హైదరాబాద్కు తరలించారు. దీనికి నిరసనగా మంగళవారం మధ్యాహ్నం ఆమె ప్రగతిభవన్ ముట్టడికి బంజారాహిల్స్లోని తన నివాసం లోటస్పాండ్ నుంచి బయలుదేరారు. సోమాజిగూడలో ఉన్న వైఎస్ విగ్రహం వద్ద నుంచి ప్రగతిభవన్ వెళ్లేందుకు ఆమె కార్యకర్తలతో రాజ్భవన్ మార్గంలో ఆర్భాటంగా బయలు దేరారు. ఈ క్రమంలోనే పంజగుట్ట పోలీసులు వాళ్లు వెళ్తున్న ర్యాలీని సోమాజిగూడలోని యశోద దవాఖాన దగ్గర అడ్డుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని.. తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. ఇంతలోనే షర్మిల కారులో వచ్చి పోలీసులపై పరుష పదజాలంతో దురుసుగా మాట్లాడారు. కార్యకర్తలు, షర్మిల హంగామా చేస్తుండటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. షర్మిలను కారులో దిగాలని పోలీసులు సూచిస్తున్నా ఆగకుండా పోలీసులపై దూసుకెళ్లారు. దీనిని రికార్డు చేస్తున్న మహిళా ఎస్సై చేతిలో నుంచి సెల్ఫోన్ను కూడా లాగేశారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి, ప్రజలు ఇబ్బందులకు గురవుతుండటంతో, ట్రాఫిక్ క్రేన్ను రప్పించి, డ్రైవింగ్ సీట్లో ఆమె కూర్చొని ఉండగానే కారును టోయింగ్ చేస్తూ ఎస్సార్ నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడ కూడా ఆమె కారులోంచి దిగకపోవడంతో ఎయిర్ పైప్ ద్వారా గాలిని కారు డోర్లలోకి పంపి, లాఠీల సాయంతో కారు తలుపులు తీసి, ఆమెను స్టేషన్లోకి తీసుకెళ్లారు. విషయం తెలుసుకొన్న ఆమె తల్లి విజయమ్మ లోటస్పాండ్ నుంచి బయలుదేరేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను నిలువరించారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్ పోలీస్స్టేషన్ వద్దకు పరామర్శించేందుకు వచ్చారు.