కాల్వశ్రీరాంపూర్, మే 31: ఉన్నత చదువులు చదివి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లి గ్రామ సర్పంచ్ ఆరెల్లి రమేశ్కు ఇద్దరు కొడుకులు. ఇందులో పెద్ద కుమారుడు సాయిరామ్ (24) రెండేండ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. కొలువు రాకపోవడం, మున్ముందు వస్తుందా? లేదా? తెలియక మనస్తాపానికి లోనయ్యాడు. రెండు రోజుల క్రితం ఇంటివద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం కరీంనగర్లోని దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు.. సాయిరామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.