హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)/వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ) ప్రాజెక్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టులోని పెద్ద పెద్ద టన్నెళ్లు, పైపులు, మోటర్లు చూసిన పర్యాటకులందరూ ఫిదా అవుతున్నారు. గతంలో కరువు జిల్లాగా పేరుగాంచిన పాలమూరు ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలంగా మారుతుందని చెప్తున్నారు. వనపర్తి నియోజకవర్గానికి చెందిన టెన్త్ విద్యార్థిని ప్రణవశ్లోక ఇటీవల ప్రాజెక్టును సందర్శించింది. టన్నెళ్లు, రిజర్వాయర్ అద్భుతంగా ఉన్నాయని, మరో ప్రపంచంలోకి వచ్చినట్టు ఉన్నదని చెప్పింది. ప్రాజెక్టుపై ప్రవణశ్లోక అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేత అరవింద్ అలిశెట్టి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. విద్యార్థి వీడియోపై ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పాలమూరులో కరువు పరిస్థితులను వివరిస్తూ.. నేడు బీఆర్ఎస్ హయాంలో చేస్తున్న అభివృద్ధి, రిజర్వాయర్లపై విద్యార్థిని చక్కగా వివరించడం అద్భుతమని మంత్రి అభినందిస్తూ శనివారం ట్వీట్ చేశారు. వనపర్తిలోని 33వ వార్డు కౌన్సిలర్ అలైఖ్యతిరుమల్, వార్డు ప్రజలు మంత్రి నిరంజన్రెడ్డి సతీమణి సింగిరెడ్డి వాసంతి ఆధ్వర్యంలో ఈ నెల 7న ఏదుల రిజర్వాయర్ను సందర్శనకు ప్రణవశ్లోక కుటుంబసభ్యులతో వెళ్లింది. అధికారులు రిజర్వాయర్ గురించి వారికి వివరించారు.