సాధికారతకు సర్కారు కట్టుబడి ఉన్నది
మంత్రులు తలసాని, సత్యవతి
యువతులు అన్ని రంగాల్లో రాణించాలి
మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత
రవీంద్రభారతి, మార్చి 8: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం రవీంద్రభారతిలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి తలసాని, మహిళా కమిషన్ చైర్పర్సన్ వీ సునీతాలక్ష్మారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్థిక సాయం అందిస్తున్నది చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణుల ప్రసవం, తిరిగి క్షేమంగా ఇంటికి చేర్చేందుకు అమ్మఒడి వాహనాలను ఏర్పాటు చేసిందని, కేసీఆర్ కిట్లు ఇస్తున్నదని తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఒంటరి మహిళలకు పింఛన్లు, ఆడపిల్లల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ప్రవేశపెట్టి పేదలను ఆదుకొంటున్నారని వివరించారు. శిశు సంక్షేమశాఖ కార్యదర్శి దివ్యాదేవరాజన్ అద్భుతంగా పనిచేస్తూ మహిళాలోకానికే మంచి పేరు తెస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వీ సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మహిళ సవాళ్లను ఎదుర్కొని అన్ని రంగాల్లో రాణించినప్పుడే గుర్తింపు ఉంటుందని చెప్పారు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో శిశుసంక్షేమశాఖ కార్యదర్శి దివ్వాదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 40 మంది మహిళా ప్రతినిధులను అవార్డులతో సత్కరించారు.