బీబీనగర్, జనవరి 1: దాడి నుంచి తప్పించుకొనేందుకు పరుగెత్తుతూ బావిలో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని నాచారం ప్రాంతానికి చెందిన కల్లెం రమేశ్ (20), వానరాసి స్వామి, సద్దుల రాఘవ, కప్పరి మహేశ్ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు బైక్లపై యాదగిరిగుట్టకు బయల్దేరారు. బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్ప్లాజా సమీపంలో చాయ్ తాగడానికి ఆగారు. అప్పటికే అక్కడ గూడూరుకు చెందిన ఇద్దరు యువకులు ఉన్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య చిన్నపాటి గొడవ ప్రారంభమైంది. దీంతో గూడూరు యువకుల తరఫున మరో ఐదుగురు అక్కడికి వచ్చారు. హైదరాబాద్ యువకులపై దాడి చేయడంతోపాటు వాహనాలను ధ్వంసం చేశారు. భయాందోళనకు గురైన హైదరాబాద్ యువకులు పరుగులు తీశారు. కప్పరి రమేశ్ పక్కన పొలాల్లోకి పరుగెత్తాడు. చీకట్లో కనిపించక బావిలో పడిపోయాడు. కొంతసేపటికి గమనించిన అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి బావిలోని నీటిని మోటర్ల సాయంతో తోడి, మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి, గూడూరు యువకులను అదుపులోకి తీసుకొన్నారు.