హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో సరికొత్త ప్రయోగానికి అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు. విద్యార్థుల్లోని ఒత్తిడిని దూరం చేసేందుకు యోగా టీచర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇందుకు గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నారు.
విద్యాంజలి పథకంలో భాగంగా కాస్ ఫౌండేషన్ సంస్థ యోగా టీచర్లను నియమిస్తామని ముందుకొచ్చింది. ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ సంస్థ వర్గాలు ఇటీవలే ఇంటర్విద్య కమిషనరేట్ అధికారులను సంప్రదించారు. యోగా టీచర్లే కాకుండా స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులను కూడా తాము సమకూర్చుతామని సంస్థ వర్గాలు.. అధికారుల దృష్టికి తీసుకొచ్చాయి. ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వ పరిశీలనకు పంపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 420 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. వీటిల్లో సుమారుగా 1.63 లక్షల మంది విద్యార్థులున్నారు.