Banoth Haripriya | అనాథ పిల్లలపాలిట అమ్మలా ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పలువురి మన్ననలు పొందుతున్నారు. మరో మదర్ థెరిసాలా సేవలందిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు అన్నీ తానై అక్కున చేర్చుకుని విద్యాదానం చేస్తున్నారు. కరోనా సమయంలో వేలాది మంది ఆకలిని తీర్చారు. తననే నమ్ముకున్న ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఊరూరా తిరుగుతూ నిత్యావసరాలు అందజేశారు. మహిళలకు, నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఇస్తూ అండగా నిలుస్తున్నారు.
ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ఉన్నత విద్యావంతురాలు. ఎంటెక్ వరకు చదువుకున్నారు. పిల్లలకు విద్య నేర్పాలనే సంకల్పంతో టేకులపల్లి, హైదరాబాద్లో విద్యాలయాలు నెలకొల్పారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. హరిప్రియ 2014లో మొదటిసారిగా ఇల్లెందు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్లో చేరారు. ఏండ్లుగా ఎవరూ చేయలేని అభివృద్ధిని ఐదేండ్లలోనే చేసి చూపించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఇల్లెందు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ప్రజాసేవలో మేటి..
ఎమ్మెల్యే హరిప్రియ తనకున్న విద్యాసంస్థల్లో అనేక మందికి ఉచితంగా విద్యాదానం చేస్తున్నారు. ఇల్లెందు పట్టణంలోని 17వ వార్డుకు చెందిన భార్యాభర్తలు ఇద్దరూ అనారోగ్యంతో మృతిచెందారు. వారి ఇద్దరు పిల్లల చదువుల కోసం ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు భరోసానిచ్చారు. నిత్యావసరాలు, వైద్యం అందించారు. నెలల తరబడి అన్నదానం చేశారు.
మహిళలకు ఉపాధి.. యువతకు ఉద్యోగ శిక్షణ…
ఎమ్మెల్యే హరిప్రియ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళలకు న్యాక్ ద్వారా ఉచిత కుట్టు శిక్షణ ఇప్పిస్తున్నారు. కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ తదితర రంగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. మహిళలకు ఉపాధి కోసం ఎంఎస్ఎంఈ ద్వారా ఎకరం స్థలంలో రూ.2.50 కోట్లతో గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పనున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ పోటీ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ ఇప్పించారు. గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఫ్యాకల్టీని రప్పించి క్లాసులు చెప్పించారు. శిక్షణ తీసుకున్న వారిలో ఇప్పటి వరకు 70 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఏజెన్సీ ప్రాంతంలోని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎంఎస్ఎంఈ ద్వారా 80 మందికి శిక్షణ ఇప్పించారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు బ్యాంకులను సంప్రదించి రుణాలు ఇప్పించారు. టీఎస్ఐఐసీ ద్వారా ఐదు ఎకరాల్లో రూ.30 కోట్లతో ఎఫ్ఎఫ్సీ (ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్) భవనం నిర్మించనున్నారు. ఐదేండ్లలో హరిప్రియ చేసినవి ఎన్నో కండ్ల ముందు కనిపిస్తున్నాయి.