రాజన్న సిరిసిల్ల, జూన్ 19 (నమస్తే తెలంగాణ)/ఎల్లారెడ్డిపేట: సకల వసతులతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సర్కారు బడి ముస్తాబైంది. రూ.8.5 కోట్లతో నిర్మించిన ఈ పాఠశాలల సముదాయాన్ని మంగళవారం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గతంలో ఇదే స్థలంలో ఉన్న నిజాం కాలం నాటి భవనంలో పరిసర మండలాలు, జిల్లాలోని మారుమూల పల్లె వాసులు విద్యనభ్యసించేవారు. అందరు ముద్దుగా పిలుచుకునే పెద్దబడి పదేండ్ల క్రితం నుంచి శిథిలావస్థకు చేరుకోవడంతో రెండేండ్ల క్రితం కూల్చివేసి సకల సౌకర్యాలతో కొత్త బడి నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఆ మేరకు మెగా ఇంజినీరింగ్ సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ.8.5 కోట్లతో భవన నిర్మాణానికి ముందుకు రాగా గతేడాది ఏప్రిల్ 23న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కేవలం 14 నెలల్లోనే పెద్దబడి నూతన సొబగులద్దుకున్నది. కంప్యూటర్ల్యాబ్, సైన్స్ల్యాబ్, డిజిటల్ క్లాస్రూమ్లు, మాడల్ డైనింగ్హాల్, టాయిలెట్లు, ఆధునిక క్రీడాప్రాంగణం, సకల వసతులతో ఆధునిక పాఠశాలల సముదాయాన్ని పూర్తి చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
నేడు సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్
ఐటీ మంత్రి కేటీఆర్ మం గళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుంటారు. ‘మన ఊరు-మనబడి’లో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. అనంతరం సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో వెయ్యి మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పరికరాలను పంపిణీ చేస్తారు. తర్వాత రాజీవ్నగర్ రోడ్డులోని మినీ స్టేడియంలో వాలీబాల్ అకాడమీని ప్రారంభిస్తారు.