జూబ్లీహిల్స్, అక్టోబర్ 27: మద్యపానం, పొగ తాగడం వంటి దురలవాట్లతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు స్థూలకాయం వంటి సమస్యల వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదాలు ఉన్నాయని నగర ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ జీ సుధీర్బాబు పేర్కొన్నారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పక్షవాతం మనిషికి తెలియకుండా కుంగదీసే ప్రమాదకర వ్యాధి అని, కొన్ని సందర్భాలలో ప్రాణాలకు సైతం ప్రమాదమని చెప్పారు.
బ్రెయిన్ స్ట్రోక్ పట్ల అందరిలో అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్కు ‘మెకానికల్ థ్రోంబెక్టమీ’ వంటి అత్యాధునిక చికిత్సా విధానాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. యశోద హాస్పిటల్ సీనియర్ న్యూమరాలజిస్ట్ డాక్టర్ ఆర్ఎస్ కోమల్కుమార్, న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ షాహ్యాన్ మొహ్సిన్ సిద్దిఖీ మాట్లాడుతూ పక్షవాతం వచ్చిన వారిని దవాఖానకు వెళ్లే వరకు థ్రోంబోలైసిస్ ఇంజెక్షన్తో సుమారు 4-5 గంటల వరకు కాపాడవచ్చని, థ్రోంబెక్టమీ చికిత్సతో 24 గంటల వరకు ప్రమాదం నుంచి కాపాడవచ్చని తెలిపారు.