హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పునకు యశోద హాస్పిటల్ నాంది పలికింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సమర్థంగా పనిచేసే ఎంఆర్ లినాక్ యంత్రాన్ని దేశంలోనే తొలిసారి అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో మంగళవారం ఈ యంత్రాన్ని ప్రారంభించారు. ఎంఆర్ఐ, రేడియేషన్ లాంటి సంప్రదాయ చికిత్సా విధానాల ఎంఆర్ లినాక్ ఎంతో మెరుగైనదని యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు తెలిపారు.
క్యాన్సర్ కణుతులను సమర్థంగా నిర్మూలించడంతోపాటు రోగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ఈ యంత్రం ఎంతో సాయపడుతుందని వివరించారు. కార్యక్రమంలో టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ సీఎస్ ప్రమేశ్, ఎలెక్టా మేనేజింగ్ డైరెక్టర్ మణికందన్ బాలా, బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ సుబ్రమణ్యేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.