యాదగిరిగుట్ట, డిసెంబర్ 22: యాదగిరిగుట్టలో శనివారం వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 6:48 గంటలకు ప్రధానాలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. పాతగుట్ట లక్ష్మీనారసింహుడు ఉత్తర రాజగోపురం గుండా 6:42 గంటలకు వైకుంఠనాథుడిగా దర్శనం ఇవ్వనున్నారు.
ఆలయ చరిత్రలో యాదగిరీశుడు ఉత్తర ద్వారం గుండా భక్తులకు రెండోసారి దర్శనమివ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు వెల్లడించారు. ఉత్తర ద్వారం ఎదురుగా భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక ఇత్తడి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ వేళల్లో మార్పులు చేసినట్టు చెప్పారు. స్వామివారి బ్రేక్ దర్శనం ఉదయం 9 గంటలకు ఉండగా.. ఆ సమయాన్ని 11 గంటలకు మా ర్చినట్టు వెల్లడించారు. భక్తులతో నిర్వహించే పలు కార్యక్రమాలను రద్దుచేశారు.