యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ఆన్లైన్ సేవల(Online Service)ను ఆలయ అధికారులు పునఃప్రారంభించారు. దేవస్థానంలో స్వామివారి సేవలు, దర్శనాలు టికెట్లను ఆన్లైన్లో అందజేసే వెబ్ పోర్టల్ను ఆధునీకరించారు. దీంతోపాటు దేవస్థాన ఆన్లైన్ సేవలను పూర్తిగా ఈసీఐఎల్ కంపెనీ( ECIL Company)కి అప్పగించగా పనులు సాగుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా దేవస్థాన వెబ్ పోర్టల్(Webportal)ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆధునీకీకరణ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ఆన్లైన్ సేవలను మంగళవారం తిరిగి పునఃప్రారంభించారు.
భక్తులు ఆన్లైన్లో yadadritemple.telangana.gov.in సేవలను సద్వినియోగించుకోవాలని ఆలయ ఈవో ఎన్.గీత సూచించారు. స్వామివారి ఆర్జిత సేవలైన నిజాభిషేకం, సహస్రనామార్చన, సుదర్శన నారసింహా హోమం, స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవం, శయనోత్సవం, జోడు సేవలు, సువర్ణ పుష్పార్చన, సుప్రభాత దర్శనం కోసం ఆన్లైన్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు.
దర్బార్ సేవ, అష్టోత్తర శతఘటాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం, వాహన పూజలు, 10 సంవత్సరాల శాశ్వత పూజలు, శాశ్వత నిజాభిషేకం పూజలతోపాటు లక్ష్మీ నిలయం, నృసింహ నిలయం, ప్రహ్లాద నిలయంలో అద్దె గదులు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించామని వెల్లడించారు.
దీంతోపాటు రూ.150 దర్శనాలు, బ్రేక్ దర్శనాల టికెట్లు, స్వామివారికి భక్తులు విరాళాలు సమర్పించుకునేందుకు ఈ- హుండీ(E-Hundi), నిత్యాన్నదాన విరాళం ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చామని, స్వామివారి ఆలయ వేళలు సైతం ఆన్లైన్లో భక్తులు వీక్షించే వీలును కల్పించామన్నారు.